Gajwel | గజ్వేల్, ఏప్రిల్ 27 : ‘మళ్లేసుడు కాదు.. ఇప్పుడే ఎలచ్చన్ పెట్టుర్రి. ఇప్పుడే తెలంగాణ పార్టీ గెలుస్తది. మిషన్లతో తెలువక మోసపోయినమ్. కేసీఆర్ దేవుడు’ అంటూ గజ్వేల్ సమీకృత మార్కెట్లో జగదేవ్పూర్ మండలం తిగుల్ గ్రామానికి చెందిన ఐలవ్వ అనే కూరగాయల వ్యాపారి మెదక్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి వెంకట్రామిరెడ్డితో అన్నమాటలివి. శనివారం ఆయన సమీకృత కూరగాయల మార్కెట్లో ఎన్నికల ప్రచారంలో భాగంగా సదరు మహిళను కారు గుర్తుకు ఓటు వేయాలి కోరారు. వెంటనే ఐలవ్వ స్పందించి కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న మోసాన్ని వివరించింది. ‘మూడు నెలల్లో పొలాలు అన్ని ఎండిపోయినయ్.. కరెంట్ పోయింది.. ఫ్రీ బస్సుతో జనం సచ్చిపోతుర్రు.
కిందొకరు సస్తుర్రు.. మీదొకరు సస్తుర్రు.. రేవంత్రెడ్డి పింఛన్లు నాలుగు వేలు ఇస్తనన్నాడు.. అదీ పోయింది. ముసలోల్లకు ఇవి అవ్వి అన్నడు.. అన్నీ పోయినయ్. ఉరేసుకొనికి పోతుర్రు. బ్యాంకుల మాఫీ అయితయన్నడు. అవీ కాలే అని ఆ మహిళ ఆవేదన వ్యక్తం చేసింది. కల్యాణలక్ష్మి ఇస్తుర్రా అని ఐలవ్వను వెంకట్రామిరెడ్డి అడగ్గా.. ఎప్పుడో దెంకపోయింది. తులం బంగారం అన్నడు అదీ పోయింది. కారుకు మళ్లేసుడు. కాదు, ఇప్పుడే ఎలచ్చన్లు పెట్టుర్రి, ఇప్పుడే తెలంగాణ వస్త్తది. ఇప్పుడే కేసీఆర్ వస్తడు. మీరు అనవసరంగా ఐదేండ్ల టైం పెట్టిర్రు. మిషన్లు పెట్టడంతో తెల్వక మోసపోయాం’ అని ఆమె పేర్కొన్నది. కచ్చితంగా అందరు కారు గుర్తుకే ఓటు వేయాలని వెంకట్రామిరెడ్డి కోరుతూ కరపత్రాన్ని అందిస్తుండగా.. ‘ఇదెందుకు సారూ.. మా ఇంట్ల కేసీఆర్ ఫొటోనే ఉన్నది’ అని చెప్పింది.