Virat Kohli : ఐపీఎల్ పదిహేడో సీజన్లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(Royal Challengers Bengaluru) పోరాటం ముగియడంతో ఆటగాళ్లతో పాటు ఫ్యాన్స్ కన్నీళ్లు పెట్టుకున్నారు. ఈ ఏడాదైనా కప్పు కొట్టాలనుకున్న బెంగళూరు ఆశలు ఎలమినేటర్(Eliminator) మ్యాచ్లో ఓటమితో ఆవిరయ్యాయి. ఆ జట్టు మాజీ సారథి విరాట్ కోహ్లీ(Virat Kohli) తాజాగా అభిమానులకు కృతజ్ఞతలు తెలిపాడు.
‘అభిమానులందరికీ మరోసారి థ్యాంక్యూ. మమ్మల్ని ఎంతో ప్రేమిస్తున్నందుకు. ఎల్లవేళలా ప్రోత్సహిస్తున్నందుకు మీకు కృతజ్ఞతలు’ అని కోహ్లీ తన పోస్ట్లో రాసుకొచ్చాడు. ఆ పోస్ట్ ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది. పదిహేడో సీజన్లో ఒక సెంచరీ, 5 అర్ధ శతకాలతో చెలరేగిన కోహ్లీ.. ఆరెంజ్ క్యాప్ రేసులో నిలిచాడు. 15 మ్యాచుల్లో విరాట్ 61.75 సగటుతో 741 రన్స్ బాదాడు.
ఐపీఎల్ టోర్నీలో సీజన్లు మారుతున్నా రాయల్ చాలెంజర్స్ బెంగళూరు విజేతగా నిలిచే రోజు మాత్రం రావడం లేదు. 2008లో ఆరంభ సీజన్ నుంచి పదిహేడో సీజన్ వరకూ ఆ జట్టును దురదృష్టం వెంటాడుతోంది. టీమ్ నిండా కోహ్లీ, డూప్లెసిస్, మ్యాక్స్వెల్, గ్రీన్ వంటి స్టార్ ఆటగాళ్లు ఉన్నా.. గతంలో మూడుసార్లు ఫైనల్ చేరినా సరే ఒక్కసారి కూడా ఆర్సీబీ కప్ కొట్టింది లేదు.
పదిహేడో సీజన్లో బెంగళూరు పేరులో మార్పలు చేసినా కలిసి రాలేదు. లీగ్ దశలో వరుసగా 6 ఓటములు.. ఆపై డబుల్ హ్యాట్రిక్ విక్టరీలతో ప్లే ఆఫ్స్ చేరిన బెంగళూరు తొలిసారి టైటిల్ వేటలో నిలిచింది. అయితే.. కీలకమైన ఎలిమినేటర్ పోరులో డూప్లెసిస్ సేన బొక్కబోర్లాపడింది. లీగ్ దశలో అదరగొట్టిన రాజస్థాన్ రాయల్స్(Rajasthan Royals) బౌలర్ల ధాటికి 712 పరుగులకే పరిమితమైంది. యశస్వీ జైస్వాల్(45), రియాన్ పరాగ్(36)ల మెరుపు బ్యాటింగ్తో స్వల్ప లక్ష్యాన్ని సంజూ సేన అలవోకగా ఛేదించింది. అంతే.. మరోసారి ఆర్సీబీ ఫ్యాన్స్ గుండెపగిలిపోయింది. ఈ సాలా కప్ నమదే అనుకొని స్టేడియాల్లో వాలిపోయిన వాళ్లంతా ఈసాలా కప్ నమ్మదల్లా అనుకుంటూ కన్నీటిపర్యంతమయ్యారు.