Virat kohli | విరాట్ కోహ్లీ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. ఇప్పటికే వన్డే, టీ20ల కెప్టెన్సీలను వదులుకున్న కోహ్లీ.. తాజాగా టెస్ట్ కెప్టెన్సీకి కూడా గుడ్ బై చెప్పాడు. ఈ విషయాన్ని ట్విట్టర్ వేదికగా వెల్లడించాడు. మహేంద్ర సింగ్ ధోనీ తర్వాత 2014లో టెస్ట్ కెప్టెన్సీ పగ్గాలు చేపట్టాడు విరాట్ కోహ్లీ. అప్పట్నుంచి ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్స్లో టీమిండియాను తొలి స్థానంలో నిలిపాడు. 68 టెస్టు మ్యాచ్లకు కెప్టెన్గా వ్యవహరించిన కోహ్లీ.. 40 విజయాలను అందించాడు. అత్యధిక మ్యాచ్లు గెలిపించిన కెప్టెన్గా నిలిచాడు.
టెస్ట్ కెప్టెన్సీని వదులుకుంటున్నట్టుగా ట్విట్టర్ వేదికగా ప్రకటించిన కోహ్లీ.. సుదీర్ఘ లేఖను రాసుకొచ్చాడు. టీమ్ను సరైన దిశలో నడిపించేందుకు ఏడేండ్లుగా తనవంతు కృషిచేస్తూ వచ్చానని ట్వీట్లో తెలిపాడు. తనకు అప్పగించిన బాధ్యతను పూర్తి నిజాయితీతో నిర్వహించానని పేర్కొన్నాడు. టీమిండియా కెప్టెన్గా ఎన్నో సవాళ్లను అధిగమించానని తెలిపాడు. తన జర్నీలో ఎన్నో విజయాలు చూశానని.. మరెన్నో పరజయాలను కూడా చూశానని.. కానీ ఎప్పుడూ ప్రయత్నాన్ని మాత్రం వదల్లేదని చెప్పాడు. పూర్తి నమ్మకంతో నూటికి 120 శాతం శ్రమించానని తెలిపాడు. టీమ్కు ఏది అవసరమో అదే చేశాను.. ఏది కరెక్ట్ కాదో అది ఎట్టి పరిస్థితుల్లో చేయలేదు. నా జట్టు గౌరవించే పని ఏదో నాకు పూర్తి క్లారిటీ ఉందని చెప్పాడు.
ఇంతకాలం నా దేశాన్ని నడిపించే బాధ్యత అందించిన బీసీసీఐకి కృతజ్ఞతలు. ఇన్నేండ్ల పాటు తోడుగా నిలిచిన జట్టు సభ్యులకు ధన్యవాదాలు. మీరంతా కలిసి నా జర్నీని మధురజ్ఞాపకంగా నిలిపారు. ఒక బండికి ఇంజిన్లా నా వెన్నంటి ఉండి నడిపించిన రవిశాస్త్రికి ఎప్పటికీ రుణపడి ఉంటా. ఇక చివరగా నన్ను నమ్మి.. కెప్టెన్గా రిఫర్ చేసిన ఎమ్మెస్ ధోనీకి బిగ్ థ్యాంక్యూ అంటూ ట్విట్టర్లో రాసుకొచ్చాడు.