ముంబై: ఇండియన్ టీమ్ కెప్టెన్ విరాట్ కోహ్లి టీ20 వరల్డ్కప్ తర్వాత కెప్టెన్సీ నుంచి తప్పుకుంటున్నాడని, అతని స్థానంలో రోహిత్ శర్మ ఆ బాధ్యతలు స్వీకరిస్తాడని వార్తలు వచ్చిన విషయం తెలుసు కదా. దీనిపై బీసీసీఐ కోశాధికారి అరుణ్ ధుమాల్ స్పందించారు. ఇవన్నీ తప్పుడు వార్తలే అని ఆయన అనడం గమనార్హం. అలాంటిదేమీ జరగడం లేదు. మీ మీడియా వాళ్లే దాని గురించి మాట్లాడుతున్నారు. ఈ అంశంపై బీసీసీఐ ఎవరినీ కలవలేదు. చర్చించలేదు అని అరుణ్ ధుమాల్ తేల్చి చెప్పారు. విరాట్ కోహ్లియే అన్ని ఫార్మాట్లకు కెప్టెన్గా కొనసాగుతాడు అని చెప్పారు.
మూడు ఫార్మాట్లలోనూ కెప్టెన్సీ కారణంగా విరాట్ తన బ్యాటింగ్పై దృష్టి సారించలేకపోతున్నాడని, అందుకే పరిమిత ఓవర్ల క్రికెట్లో కెప్టెన్సీని రోహిత్కు అప్పగించవచ్చన్న వార్తలు వచ్చాయి. డబ్ల్యూటీసీ ఫైనల్లో టీమ్ ఓడిపోవడం, ఆ మ్యాచ్కు కోహ్లి టీమ్ను ఎంపిక చేసిన విధానంపై బీసీసీఐ గుర్రుగా ఉన్నదని, అప్పటి నుంచే కెప్టెన్సీ మార్పుపై చర్చ జరుగుతున్నదనీ బోర్డు వర్గాలు చెప్పాయి. అయితే అరుణ్ ధుమాల్ మాత్రం అలాంటిదేమీ జరగలేదని చెప్పారు.