ముంబై: టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ షాకింగ్ న్యూస్ చెప్పాడు. ఐసీసీ టీ20 వరల్డ్ కప్ తర్వాత పొట్టి క్రికెట్కు సారథ్య బాధ్యతల నుంచి తప్పుకోనున్నట్లు వెల్లడించాడు. ఇండియన్ టీమ్ ( Team India ) కెప్టెన్గా ఉన్న విరాట్ కోహ్లి టీ20 వరల్డ్కప్ తర్వాత పరిమిత ఓవర్ల కెప్టెన్సీ నుంచి తప్పుకోనున్నాడన్న వార్త సోమవారం సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఓ ప్రముఖ పత్రిక దీనికి సంబంధించిన వార్తను ప్రచురించింది. కోహ్లి టెస్ట్ కెప్టెన్సీకే పరిమితమవుతాడని, వన్డేలు, టీ20ల్లో రోహిత్ శర్మ సారథ్యం వహిస్తాడన్నది ఆ వార్త సారాంశం. అయితే ఆ వార్తలను నిజం చేస్తూ.. ఇవాళ కోహ్లీ తన నిర్ణయాన్ని వెల్లడించాడు. అక్టోబర్లో దుబాయ్లో జరగనున్న టీ20 వరల్డ్ కప్ తర్వాత టీ20 కెప్టెన్సీ నుంచి తప్పుకోనున్నట్లు కోహ్లీ ఓ సోషల్ మీడియా పోస్టులో స్పష్టం చేశాడు.
నిజానికి మూడు ఫార్మాట్లలోనూ కోహ్లి కెప్టెన్సీలో టీమిండియా అద్భుతంగా రాణిస్తోంది. ఐసీసీ ట్రోఫీ గెలవలేకపోయాడన్న అపవాదు తప్ప ఇప్పటి వరకూ విరాట్ కెప్టెన్సీపై ఎలాంటి మరకా లేదు. అయితే మూడు ఫార్మాట్లలో కెప్టెన్సీ భారం వల్ల తన బ్యాటింగ్పై దృష్టి సారించలేకపోతున్నాడని, అందుకే పరిమిత ఓవర్ల క్రికెట్ వరకూ ఈ బాధ్యతల నుంచి తప్పుకోవాలని విరాట్ భావిస్తున్నట్లు ఇటీవల వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. ఆ వార్తలను బీసీసీఐ ఖండించినా.. ఇవాళ విరాట్ దానిపై క్లారిటీ ఇచ్చేశాడు.
టీ20 కెప్టెన్గా విరాట్ రికార్డు ఇదీ..
45 మ్యాచ్లు ఆడాడు. 27 గెలిచాడు. 14 మ్యాచ్ల్లో ఓటమి. రెండు మ్యాచ్లు టై. మరో రెండు మ్యాచ్ల్లో ఫలితం తేలలేదు. టెస్టులు, వన్డేల్లో సారథ్య బాధ్యతలను పూర్తి స్థాయిలో నిర్వర్తించాలంటే కొంత బడలిక అవసరమని కోహ్లీ తన ట్వీట్లో తెలిపాడు. కోహ్లీ స్థానంలో టీ20 జట్టుకు రోహిత్ శర్మ కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టే అవకాశాలు ఉన్నాయి. అయితే బీసీసీఐ దీనిపై నిర్ణయాన్ని ప్రకటించాల్సి ఉంది.