తాజాగా ముగిసిన శ్రీలంక టీ20 సిరీస్లో భారత యువ బ్యాటర్ శ్రేయాస్ అయ్యర్ అదిరిపోయే ప్రదర్శన చేశాడు. మాజీ సారధి విరాట్ కోహ్లీ గైర్హాజరీలో మూడో స్థానంలో బ్యాటింగ్ చేసిన అతను.. లంకతో జరిగిన మూడు టీ20ల్లో అర్ధసెంచరీలు చేయడమే కాకుండా అజేయంగా నిలిచాడు. మూడు మ్యాచుల్లో కలిసి 204 పరుగులు చేసి ప్లేయర్ ఆఫ్ ది సిరీస్గా నిలిచాడు. అయితే కోహ్లీ గనుకు జట్టులోకి తిరిగొస్తే అయ్యర్ స్థానం ఏంటనే ప్రశ్న చాలా మంది మదిలో మెదులుతోంది. దీనిపై మాజీ దిగ్గజం సునీల్ గవాస్కర్ స్పందించాడు.
కోహ్లీని ఆ స్థానం నుంచి తప్పించడం అసాధ్యమని గవాస్కర్ అభిప్రాయపడ్డారు. అప్పుడు అయ్యర్ను 4వ స్థానంలో దించాలి. కానీ సూర్యకుమార్ యాదవ్ ఈ స్థానంలో వస్తున్నాడు. అలాంటప్పుడు ఏం చేయాలనేది పెద్ద తలనొప్పేనని సన్నీ అంగీకరించాడు. కానీ ఇది మంచి తలనొప్పి అని చెప్పాడు. 4వ స్థానంలో సూర్యకుమార్ ఉన్నాడు కాబట్టి మరో స్థానం కిందకు దించి 5వ స్థానంలో అయ్యర్ను దించాలి. కానీ అక్కడ రిషభ్ పంత్ ఉన్నాడు.
విండీస్తో జరిగిన సిరీస్లో సూర్యకుమార్ ప్రదర్శన చూసిన తర్వాత అతన్ని జట్టు నుంచి తప్పించడం అసాధ్యమని కూడా లిటిల్ మాస్టర్ అభిప్రాపయడ్డాడు. అయితే ఇలా టాప్ బ్యాటింగ్ లైనప్ ఉండటం వల్ల ప్యూర్ బౌలర్లను జట్టులోకి తీసుకునే అవకాశం ఉంటుందని ఈ లెజెండరీ క్రికెటర్ చెప్పాడు.
‘‘చాలా ఆప్షన్లు ఉండటం వల్ల ప్యూర్ బౌలర్లను ఎంచుకునే అవకాశం ఉంటుంది. అంటే మహమ్మద్ సిరాజ్ లేదా ఆవేశ్ ఖాన్ వంటి వారిని తీసుకోవచ్చు. వీళ్లిద్దరూ పెద్ద బ్యాటర్లు కాదు. శార్దూల్ ఠాకూర్, దీపక్ చాహర్ లేదా భువనేశ్వర్ కుమార్ వంటి బ్యాటింగ్ తెలిసిన పేసర్లనే ఎంచుకోవాల్సిన అవసరం ఉండదు. పూర్తి ఎటాకింగ్ గురించి ఆలోచించుకునే అవకాశం ఉంటుంది’’ అని సన్నీ పేర్కొన్నాడు. మరి జట్టు మేనేజ్మెంట్ ఈ విషయంలో ఏం చేస్తుందో చూడాలి.