Venkatesh Prasad : వెస్టిండీస్పై రెండో వన్డేలో భారత జట్టు(Team India) ఓటమిని అభిమానులే కాదు మాజీ క్రికెటర్లు తేలికగా తీసుకోవడం లేదు. వరల్డ్ క్లాస్ జట్టు అయి ఉండి అధ్వాన్నంగా ఆడడంపై తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. తాజాగా మాజీ క్రికెటర్ వెంకటేశ్ ప్రసాద్(Venkatesh Prasad) టీమిండియాను కడిగి పారేశాడు. టెస్టు క్రికెట్(Test Cricket) తప్పిస్తే.. గత కొన్నాళ్లుగా వన్డేలు, టీ20ల్లో భారత జట్టు దారుణంగా విఫలం అవుతోందని అన్నాడు. డబ్బులు, అధికారం అన్నీ ఉన్నా కూడా సాధారణ విజయాలకే పొంగిపోతున్నామని, చాంపియన్ జట్టు కావడానికి మనం చాలా దూరంలో ఉన్నాం అని విమర్శలు గుప్పించాడు.
‘బంగ్లాదేశ్, దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియాపై వన్డే సిరీస్ ఓడిపోయాం. గత రెండు టీ20 వరల్డ్ కప్స్(T20 World Cups)లో టీమిండియా చెత్త ఆటతో మధ్యలోనే ఇంటిదారి పట్టింది. అంతేకాదు వరల్డ్ టాప్ జట్లు ఇంగ్లండ్ అంత దూకుడుగా, ఆసీస్ అంత విధ్వంసకంగా భారత జట్టు ఆడడం లేదు’ అని వెంకటేశ్ ప్రసాద్ గుర్తు చేశాడు. ఈకాలం భారత క్రికెటర్లకు డబ్బు, గర్వం వల్ల ఆటపై దృష్టి పెట్టడం లేదని 1983 వరల్డ్ కప్ కెప్టెన్ కపిల్ దేవ్(Kapil Dev) కూడా విమర్శించాడు.
రెండో వన్డేలో చిత్తుగా ఓడిన భారత జట్టు
విండీస్పై టెస్టు సిరీస్ నెగ్గిన టీమిండియా వన్డే సిరీస్లో కూడా అవలీలగా సొంతం చేసుకుంటుంది అనుకున్నారంతా. కానీ, రెండో వన్డేలో ఆతిథ్య జట్టు దిమ్మతిరిగే షాక్ ఇచ్చింది. తొలి వన్డే ఓటమి నుంచి అనూహ్యంగా పుంజుకొని భారత్ను చిత్తు చేసింది. రోహిత్ శర్మ(rohit sharma), విరాట్ కోహ్లీ(virat kohli) గైర్హాజరీలోని ఇండియా 181 పరుగులకే ఆలౌటయ్యింది. ఇషాన్ కిషన్(57) ఒక్కడే వరుసగా రెండో హాఫ్ సెంచరీతో రాణించాడు. స్వల్ప లక్ష్యాన్ని విండీస్ 6 వికెట్లు కోల్పోయి ఛేదించింది. దాంతో, సిరీస్ సమం అయింది. కీలకమైన మూడో వన్డే ఆగస్టు 1న జరుగనుంది.