మూసీ సుందరీకరణ ప్రక్రియ కార్యరూపం దాల్చనున్నది. హైదరాబాద్ మహానగరంలో అత్యంత ప్రతిష్టాత్మక ప్రాజెక్టుగా దీన్ని చేపట్టేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తున్నది. నగరానికి పడమర దిక్కున ఉన్న జంట జలాశయాలైన గండిపేట, హిమాయత్సాగర్ నుంచి మొదలై, తూర్పు దిక్కున ఉన్న కొర్రెములు, బాచారం వరకు 53 కి.మీ మేర పారుతున్న మూసీ నదిని సుందరంగా తీర్చిదిద్దేందుకు పటిష్టమైన ప్రణాళికను చేపట్టింది. గుజరాత్లోని సబర్మతీ నది తరహాలో మూసీని స్వచ్ఛమైన నదీ జలాలతో నిత్యం పారేలా చేసేందుకు క్రమంగా అడుగులు పడుతున్నాయి. రెండేళ్లలో సుమారు రూ.20 కోట్లతో మూసీనదిని శుభ్రం చేయడంతోపాటు బఫర్ జోన్ల గుర్తింపు, 4-5 చోట్ల వాక్వేలను నిర్మించారు. తాజాగా రాష్ట్ర ప్రభుత్వం రూ.200 కోట్లను కేటాయించడంతో మూసీ సుందరీకరణకు సంబంధించి డీపీఆర్(సమగ్ర ప్రాజెక్టు నివేదిక)ను రూపొందించే పనిలో ఎంఆర్డీసీఎల్ నిమగ్నమైంది.
ఆగస్టు- సెప్టెంబర్ నాటికి డీపీఆర్
నార్సింగి వద్ద ఉన్న ఔటర్ రింగ్ రోడ్డు నుంచి బాచారం వరకు ఉన్న మూసీ నదిలో పేరుకుపోయిన చెత్తా చెదారం, పిచ్చిమొక్కలు, వ్యర్థాలను పూర్తిస్థాయిలో తొలగించారు. అదే సమయంలో డ్రోన్ల ద్వారా సర్వే నిర్వహించారు. నదికి ఇరువైపులా 50 మీటర్ల వరకు బఫర్ జోన్ను గుర్తించి సరిహద్దులు నిర్ణయించారు. ఇక అత్యంత కీలకమైన డీపీఆర్ రూపకల్పన బాధ్యతలను ప్రైవేటు సంస్థలకు అప్పగించనున్నారు. ఈ ప్రకియ ఆగస్టు-సెప్టెంబర్ నాటికి పూర్తయ్యే అవకాశం ఉందని మూసీ రివర్ఫ్రంట్ డెవలప్మెంట్ అధికారులు తెలిపారు. ఈ ప్రాంతంలో ఎలాంటి అభివృద్ధి పనులు చేపట్టాలి? అందుకు ఎంత ఖర్చవుతుందనే అంచనాను డీపీఆర్లో లెక్కించనున్నారు. ప్రాథమికంగా అందిన సమాచారం ప్రకారం సుమారు రూ.8 నుంచి 10వేల కోట్లతో మూసీ సుందరీకరణ, మూసీ పొడవునా ఈస్ట్-వెస్ట్ కారిడార్ (ఫ్లైఓవర్ బ్రిడ్జి) నిర్మాణాన్ని చేపట్టాలని నిర్ణయించారు. ఇందుకు అవసరమైన నిధులను ప్రభుత్వ, ప్రైవే టు సంస్థల నుంచి తీసుకోవడం లేదా, ప్రభుత్వ,ప్రైవేటు భాగస్వామ్య (పీపీపీ) విధానంలో చేపట్టేలా ప్రణాళికను సిద్ధం చేయనున్నారు.
మూసీలో స్వచ్ఛ జలాలు..
సుందరీకరణ ప్రాజెక్టు పూర్తయితే మురికి కూపంగా ఉన్న మూసీ స్వచ్ఛమైన జలాలతో జీవనదిగా మారుతుంది. రాష్ట్రంలో పారుతున్న కృష్ణా,గోదావరి, మంజీరా నదుల్లో మూసీ నది సైతం ఉండేలా తీర్చిదిద్దాలన్న లక్ష్యంతో ప్రభుత్వం ఉంది. యేటా వానాకాలంలో వచ్చే వరదతో జంట జలాశయాలు నిండేందుకే సరిపోవడం లేదు. దీంతో కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి గోదావరి నీటిని గండిపేట(ఉస్మాన్సాగర్), హిమాయత్సాగర్లకు తరలించే ఏర్పాట్లు చేస్తున్నారు. దీంతో ఆ రెండు జలాశయాలు గోదావరి నీళ్లతో నింపిన తర్వాత, ఆ నీరు మూసీ నది ద్వారా కిందకు నిరంతరం పారేలా చేయనున్నారు. ప్రస్తుతం మూసీ నది మురుగునీరుతో పారుతోంది. దాన్ని పూర్తిగా అరికట్టేందుకు నది పొడవునా 50కి పైగా సీవరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్లను ఏర్పాటు చేసి, ముగురునీటిని 100 శాతం శుద్ధి చేసిన తర్వాతే నదిలోకి వదిలి పెట్టేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ఇవన్నీ మూసీ సుందరీకరణ ప్రాజెక్టులో భాగంగా చేపట్టనున్నారు.
పలు నదులపై అధ్యయనం..
గుజరాత్లోని సబర్మతీ నదిని అధికారులు ప్రత్యేకంగా సందర్శించారు. అదేవిధంగా విదేశాల్లోని పలు నగరాల మధ్య ఉన్న నదుల తీరుతెన్నులను ప్రత్యేకంగా అధ్యయనం చేసి వచ్చారు. వాటిని దృష్టిలో పెట్టుకొని అంతకుమించి అత్యాధునిక మౌలికవసతులు, వినోదం, ఆహ్లాదం ఉండేలా మూసీ తీరాలను అధికారులు డిజైన్ చేయించనున్నారు.
అంతర్జాతీయ టెండర్లు పిలిచిన హెచ్ఎండీఏ
సిటీబ్యూరో, మార్చి 23 (నమస్తే తెలంగాణ): హుస్సేన్సాగర్ జలాల శుద్ధి కోసం హైదరాబాద్ మహానగరాభివృద్ధి సంస్థ అంతర్జాతీయ టెండర్లను పిలిచింది. శుద్ధి చేసే ప్రక్రియకు అవసరమైన డిజైన్ రూపొందించడం, ఆధునిక విధానాల్లో బయో రెమిడియేషన్ ప్రక్రియను నిర్వహించే బాధ్యతలను అర్హత కలిగిన సంస్థలకు అప్పగించనున్నారు. నగరం నడిబొడ్డున హుస్సేన్సాగర్ జలాలు మురికి కూపంగా మారడంతోపాటు వేసవిలో తలెత్తే సమస్యలను పరిష్కరించేందుకు బయో రెమిడియేషన్ ప్రక్రియను నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా నాచు పేరుకుపోయి దుర్వాసన రాకుండా చూడటంతోపాటు సాగర్ జలాలు మురికి కూపంగా మారకుండా నిరంతర పర్యవేక్షణ చేపట్టాల్సి ఉంటుంది. ఇందుకోసం జాతీయ , అంతర్జాతీయ సంస్థల నుంచి టెండర్లు ఆహ్వానిస్తున్నామని హెచ్ఎండీఏ అధికారులు తెలిపారు. 6 నెలల పాటు నిర్వహించే బయో రెమిడియేషన్ ప్రక్రియ కోసం సుమారు 2.5 కోట్లు వెచ్చించనున్నారు.
25న ఫ్రీ బిడ్ మీటింగ్…
టెండర్ ప్రకియను పూర్తి చేసేందుకు ఈనెల 25న ఫ్రీ బిడ్ మీటింగ్ను అమీర్పేటలోని హెచ్ఎండీఏ కార్యాలయంలో నిర్వహించనున్నారు. ఈ టెండర్కు సంబంధించిన సమాచారం కోసం ఈనెల 24వ తేదీన ఈమెయిల్ ద్వారా సంప్రదించాలని అధికారులు తెలిపారు. ప్రతిపాదనలను ఈ నెల 30వ తేదీ మధ్యాహ్నం 3.30గంటల వరకు అందజేయాలని, నియమ నిబంధనలకు లోబడి టెండర్లలో పాల్గొన్న సంస్థలను ఎంపిక చేస్తామని అధికారులు వివరించారు.