ఆస్ట్రేలియాతో సిరీస్ ముగిసిన రెండ్రోజులకే భారత జట్టు దక్షిణాఫ్రికాతో కూడా మూడు మ్యాచ్ల టీ20 సిరీస్ ఆడనున్నది. ఈ నెల 28న తిరువనంతపురం (కేరళ) లో ఇరు జట్ల మధ్య మొదటి టీ20 జరగాల్సి ఉంది. అయితే ఈ సిరీస్ ప్రారంభానికి ముందే భారత జట్టుకు మరో షాక్ తగిలేలా ఉంది. ఆసీస్తో సిరీస్లో ఎంపికైనా కరోనా కారణంగా ఆడలేకపోయిన టీమిండియా వెటరన్ పేసర్ మహ్మద్ షమీ.. సఫారీలతో కూడా ఆడేది అనుమానమే.
మొహాలీలో ఆసీస్తో జరిగిన మొదటి టీ20కి ముందు కరోనా బారిన పడ్డ షమీ ఆ సిరీస్ నుంచి తప్పుకున్నాడు. అయితే వారం రోజులు గడిచినా షమీ ఆరోగ్యం గురించి సమాచారం లేదు. అతడు కోలుకున్నాడా..? లేదా..? కోలుకుంటే ఆడేందుకు ఫిట్గా ఉన్నాడా..? అనేదీ అనుమానంగానే ఉంది. దీంతో అతడి స్థానంలో ‘జమ్మూ ఎక్స్ప్రెస్’ ఉమ్రాన్ మాలిక్ను స్టాండ్ బై ప్లేయర్గా జట్టులోకి ఎంపిక చేయనున్నట్టు సమాచారం.
ఆసీస్తో సిరీస్లో షమీ స్థానాన్ని సీనియర్ పేసర్ ఉమేశ్ యాదవ్తో భర్తీ చేయించినా అతడు విఫలమయ్యాడు. తొలి మ్యాచ్లో ఆడిన ఉమేశ్.. భారీగా పరుగులిచ్చుకున్నాడు. దీంతో అతడిని తర్వాత రెండు మ్యాచ్లలో ఆడించలేదు. ఈ నేపథ్యంలో ఉమేశ్ను కొనసాగించడం కంటే ఉమ్రాన్ను తీసుకుంటేనే ఉత్తమమనే అభిప్రాయంలో సెలక్టర్లు ఉన్నట్టు తెలుస్తున్నది.
ఉమ్రాన్ ప్రస్తుతం ఇండియా-ఏ, న్యూజిలాండ్-ఏ మధ్య జరుగుతున్న వన్డే సిరీస్ కోసం చెన్నైలో ఉన్నాడు. షమీ ఫిట్నెస్ పై అనుమానాలు నెలకొనడంతో అతడి రిప్లేస్మెంట్గా ఉమ్రాన్ను ఎంపిక చేయనున్నట్టు సమాచారం.
దక్షిణాఫ్రికా సిరీస్కు టీమిండియా : రోహిత్ శర్మ (కెప్టెన్), కెఎల్ రాహుల్ (వైస్ కెప్టెన్), విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, దీపక్ హుడా, రిషభ్ పంత్, దినేశ్ కార్తీక్, ఆర్.అశ్విన్, చహాల్, అక్షర్ పటేల్, అర్ష్దీప్ సింగ్, మహ్మద్ షమీ, హర్షల్ పటేల్, దీపక్ చాహర్, జస్ప్రీత్ బుమ్రా