అంతర్జాతీయ క్రీడా వేదికలపై తెలంగాణ క్రీడాకారులు సత్తా చాటుతున్నారు. హైదరబాదీ నిఖత్ జరీన్ ప్రపంచ మహిళా బాక్సింగ్ టైటిల్ సాధించిన వార్త విన్న గంటల వ్యవధిలోనే.. మరో తెలంగాణ పిల్లాడు బంగారు పతకంతో మెరిశాడు. సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ సొసైటీ (టీఎస్డబ్ల్యూఆర్ఈఐఎస్) విద్యార్థులు ప్రపంచ స్కూల్ గేమ్స్ జిమ్నాసియాడ్లో సత్తాచాటారు.
షేక్పేటలోని టీఎస్డబ్ల్యూఆర్ఈఐఎస్ స్పోర్ట్స్ అకాడమీకి చెందిన పారా అథ్లెట్ రవి కిరణ్.. జావెలిన్ త్రోలో బంగారు పతకంతో మెరిశాడు. అదే సమయంలో దిండి టీఎస్డబ్ల్యూఆర్ఈఐఎస్ స్పోర్ట్స్ అకాడమీకి చెందిన మాయావతి.. 200 మీటర్ల పరుగు పందెంలో కాంస్య పతకం సాధించింది. ఫ్రాన్స్ దేశ రాజధాని పారిస్ వేదికగా జరిగిన ఈ టోర్నీలో.. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న స్కూలు విద్యార్థులతో తలపడిన తెలంగాణ బిడ్డలు జయకేతనం ఎగరేశారు.
క్రీడల్లో సత్తా చాటేందుకు పేదరికం అడ్డుకాకూడదనే ఉద్దేశ్యంతో తెలంగాణ రాష్ట్ర సీఎం కేసీఆర్ ఆలోచించి.. 28 స్పోర్ట్స్ అకాడమీలు శాంక్షన్ చేశారని, దాని వల్లనే ఇవాళ పేదింటి బిడ్డలు కూడా అంతర్జాతీయ వేదికలపై సత్తా చాటుతున్నారని టీఎస్డబ్ల్యూఆర్ఈఐఎస్ సెక్రటరీ రోనాల్డ్ రోజ్ అన్నారు. ఇది టీఎస్డబ్ల్యూఆర్ఈఐఎస్ చరిత్రలో నూతన అధ్యాయమని కొనియాడారు.