T20 World Cup | టీ20 ప్రపంచ కప్ కోసం టీమిండియా జట్టు ప్రస్తుతం ఆస్ట్రేలియాలో ఉంది. ఇటీవల పాకిస్థాన్తో జరిగిన సూపర్ 12 మ్యాచ్లో ఇండియా స్టన్నింగ్ విక్టరీ నమోదు చేసిన విషయం తెలిసిందే. పాకిస్థాన్పై విజయం సాధించి ఫుల్ జోష్ మీదున్న భారత జట్టు.. గురువారం నెదర్లాండ్స్తో తలపడనుంది. ఈ నేపథ్యంలో తదుపరి మ్యాచ్ కోసం సన్నద్ధమవుతోంది.
ఈ క్రమంలో ఆహారం విషయంలో భారత జట్టు తీవ్ర ఇబ్బంది పడుతోంది. నెదర్లాండ్స్ తో మ్యాచ్ కోసం సిడ్నీ చేరుకున్న రోహిత్ సేన.. మంగళవారం ప్రాక్టీస్ సెషన్ లో పాల్గొంది. అయితే, ప్రాక్టీస్ సమయంలో వారికి నిర్వాహకులు పండ్లు, కస్టమ్ శాండ్విచ్ అందించారు. అయితే, అవి చల్లగా ఉండటం పట్ల క్రికెటర్లు అసంతృప్తి వ్యక్తం చేశారు. మధ్యాహ్నం వరకు ప్రాక్టీస్లో ఉండటం.. లంచ్ సమయం కావడంతో ఆటగాళ్ళు ఫుల్ మీల్స్ ఆశించారు. దీంతో నిర్వాహకులు పంపించిన ఫుడ్ని తిరస్కరించారు. తమ హోటల్ గదులకు వెళ్లి ఆహారం తీసుకున్నారు.
దీనిపై బీసీసీఐకి చెందిన ఓ అధికారి మాట్లాడుతూ… ‘‘ఇది ఐసీసీ పంపించిన ఆహారాన్ని బహిష్కరించినట్టు కాదు. కొంతమంది ఆటగాళ్ళు పండ్లు, ఫలాఫెల్ తీసుకున్నారు. అయినా ప్రతి ఒక్కరూ భోజనం చేయాలని కోరుకున్నారు. అందుకే హోటల్ కి వెళ్లి భోజనం చేశారు. ఇక్కడ సమస్య ఏమిటంటే లంచ్ సమయంలో ఐసీసీ వేడి ఆహారాన్ని అందించకపోవడం. ద్వైపాక్షిక సిరీస్లో ఆతిథ్య దేశం క్యాటరింగ్ బాధ్యతలు నిర్వహిస్తుంది. వాళ్లు ఎల్లప్పుడూ శిక్షణ తర్వాత వేడి వేడి భారతీయ భోజనాన్ని అందిస్తారు. కానీ ఐసీసీ నియమం అన్ని దేశాలకు ఒకేలా ఉంటుంది. రెండు గంటల శిక్షణ తర్వాత మీకు అవోకాడో, టొమాటో, దోసకాయలతో కూడిన చల్లని శాండ్విచ్ తినలేరు కదా’’ అని అన్నారు.