తొలి పోరులో కొట్టింది కొండంతైనా.. చివరి ఓవర్ వరకు గట్టెక్కలేకపోయిన టీమ్ఇండియా.. న్యూజిలాండ్తో రెండో వన్డేకు రెడీ అయింది. ఉప్పల్ పరుగుల ప్రవాహాన్ని రాయ్పూర్లోనూ కొనసాగించాలని రోహిత్ సేన చూస్తుంటే.. గత మ్యాచ్లో విజయం అంచుల వరకు చేరిన కివీస్.. సిరీస్ సమం చేయాలని పట్టుదలతో ఉంది. రాయ్పూర్ స్టేడియంలో ఇదే తొలి అంతర్జాతీయ మ్యాచ్ కాగా.. డబుల్ సెంచరీ హీరో శుభ్మన్ గిల్పైనే అందరి కండ్లు నిలువనున్నాయి!
రాయ్పూర్: సొంతగడ్డపై వరుస సిరీస్ విజయాలు సాధిస్తున్న టీమ్ఇండియా.. మరో పోరుకు రెడీ అయింది. మూడు మ్యాచ్ల సిరీస్లో భాగంగా శనివారం భారత్, న్యూజిలాండ్ మధ్య ఇక్కడ రెండో వన్డే జరుగనుంది. హైదరాబాద్ వేదికగా జరిగిన తొలి పోరులో నెగ్గి 1-0తో ముందంజలో ఉన్న రోహిత్ సేన.. ఇదే ఊపులో సిరీస్ పట్టేయాలని భావిస్తున్నది.
ఈ ఏడాది చివర్లో స్వదేశంలో వన్డే ప్రపంచకప్ జరుగనున్న నేపథ్యంలో యువ ఆటగాళ్లకు విరివిగా అవకాశాలు ఇస్తున్న మేనేజ్మెంట్.. ఈ మ్యాచ్లోనూ అదే కొనసాగించనుంది. గత పోరులో ద్విశతకంతో అదరగొట్టిన శుభ్మన్ గిల్తో పాటు ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్, వాషింగ్టన్ సుందర్, మహమ్మద్ సిరాజ్ వంటి వాళ్లకు ఇది మరో చక్కటి అవకాశం కానుంది. ఇటీవల లంకేయులపై టీ20, వన్డే సిరీస్లు నెగ్గి ఫుల్ జోష్లో ఉన్న భారత జట్టుకు .. హైదరాబాద్లో విజయం అంత తేలిగ్గా వరించలేదు. భారీ స్కోరు చేసినా.. గెలుపు గీత దాటడానికి చివరి ఓవర్ వరకు వేచి చూడాల్సి వచ్చింది. పోరాడటంలో తమకు సాటిలేరని న్యూజిలాండ్ ప్లేయర్లు మరోసారి నిరూపించారు. సగం పరుగులకు ముందే ఆరు వికెట్లు కోల్పోయిన ఆ జట్టు.. విజయానికి కేవలం 12 పరుగుల దూరంలో నిలిచిపోయిందంటే వారి ఆటతీరు ఎలా సాగిందో అర్థం చేసుకోవచ్చు. రెండో వన్డేలోనూ అదే జోరు కొనసాగించి సిరీస్ సమం చేయాలని కివీస్ భావిస్తున్నది.
ఉమ్రాన్ను పరీక్షిస్తారా..
రాయ్పూర్లో ఇదే తొలి అంతర్జాతీయ మ్యాచ్ కాగా.. 50 వేలకు పైగా అభిమానులు మైదానంలో సందడి చేయనున్నారు. రోహిత్, శుభ్మన్ గిల్ రూపంలో మంచి ఓపెనింగ్ జోడీ కుదురుకోగా.. మూడో స్థానంలో రన్మెషీన్ విరాట్ కోహ్లీ బరిలోకి దిగనున్నాడు. ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా రూపంలో మిడిలార్డర్ కూడా బలంగానే కనిపిస్తున్నా.. యువ ఆటగాళ్లలో నిలకడ లేమి సమస్యగా కనిపిస్తున్నది. స్పిన్ ఆల్రౌండర్ వాషింగ్టన్ సుందర్ పక్కా కాగా.. స్పెషలిస్ట్ స్పిన్నర్గా కుల్దీప్ యాదవ్ జట్టులో చోటు దక్కించుకోనున్నాడు. వన్డే క్రికెట్లో అద్వితీయ ప్రదర్శన చేస్తున్న హైదరాబాదీ పేసర్ మహమ్మద్ సిరాజ్తో పాటు సీనియర్ మహమ్మద్ షమీ పేస్ భారాన్ని మోయనున్నారు.
పిచ్ బౌన్స్కు సహకరించనుందని.. కివీస్ శిబిరం భావిస్తున్న నేపథ్యంలో ఉమ్రాన్ మాలిక్కు తుది జట్టులో చాన్స్ దొరుకుతుందా చూడాలి. ఎనిమిదో స్థానంలో బ్యాటింగ్ చేయగల వాళ్లు ఉంటే మంచిదనే ఉద్దేశంతోనే శార్దూల్ ఠాకూర్ను ఆడించామని రోహిత్ శర్మ పేర్కొన్నా.. బౌలింగ్లో అతడు పెద్దగా ప్రభావం చూపలేకపోయాడు. బ్రాస్వెల్ ధాటికి పదే పదే గతితప్పిన శార్దూల్ గాడిన పడాల్సిన అవసరముంది. మరోవైపు సీనియర్ ఆటగాళ్లు కేన్ విలియమ్సన్, సౌథీ అందుబాటులో లేకున్నా.. యువ ప్రతిభతో ఆ జట్టు బలంగా ఉంది. అలెన్, కాన్వే, నికోల్స్, మిషెల్, లాథమ్, ఫిలిప్స్, బ్రాస్వెల్, శాంట్నర్ రూపంలో నాణ్యమైన ఆటగాళ్లకు జట్టులో కొదవ లేదు. వీరంత సమష్టిగా రాణిస్తే.. ఇరు జట్ల మధ్య మరో రసవత్తర పోరు ఖాయమే.