న్యూఢిల్లీ: వచ్చే నెలలో జరుగనున్న టీ 20 ప్రపంచకప్లో టీమ్ఇండియా గెలుపోటములు ఇద్దరు ప్లేయర్ల ఆటతీరుపైనే ఆధారపడి ఉంటాయని భారత మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్ (Gautam Gambhir) అన్నాడు. టాప్ ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా, స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా ప్రపంచకప్లో తప్పనిసరిగా మెరవాల్సిందేనని అభిప్రాయపడ్డాడు. పాండ్యా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదని, అతడు ప్రపంచ స్థాయి ఆటగాడని వెల్లడించాడు. అతడు బ్యాట్తోపాటు, బాల్తో కూడా వండర్ చేస్తున్నాడని కొనియాడాడు. బౌలింగ్లో గంటకు 140 కిలోమీటర్ల వేగంతో బాల్స్ వేస్తున్న విషయం మనందరికీ తెలిసిందేనని, ఒక ఆల్రౌండర్ నుంచి ఇంతకంటే ఎక్కువ ఏం ఆశించగలమన్నాడు. పాండ్యా ఒక మ్యాచ్ విన్నరని, ఎక్స్-ఫ్యాక్టరని చెప్పాడు. ప్రస్తుత ఫామ్ను వరల్డ్ కప్లో కూడా కొనసాగించాలని అభిప్రాయపడ్డాడు.
ఇక గాయంతో పునరావాస కేంద్రంలో ఉన్న జస్ప్రీత్ బుమ్రా కూడా టీమ్ఇండియాకు కీలక ఆటగాడని చెప్పాడు. ఎలాంటి పరిస్థితుల్లోనైనా వీరిద్దరు బౌలింగ్ చేయగలరని కితాబిచ్చాడు. అందుకే టీ 20 ప్రపంచకప్లో భారత్ గెలవాలంటే పాండ్యా, బుమ్రా తప్పనిసరిగా మెరవాల్సిందేనని స్పష్టం చేశాడు. వారిద్దరి ఆటతీరుపైనే టీమ్ఇండియా గెలుపోటములు ఆధారపడి ఉంటాయని మాజీ ఓపెనర్ చెప్పాడు. టీ 20 వరల్డ్ కప్ అక్టోబర్ 22 నుంచి ప్రారంభం కానుంది.