ముంబై: భారత్, ఆస్ట్రేలియా మహిళల జట్ల మధ్య జరుగుతున్న ఏకైక టెస్టు ఆసక్తికరంగా సాగుతున్నది. పిచ్ పరిస్థితులను సద్వినియోగం చేసుకుంటూ మన అమ్మాయిలు అదరగొడుతున్నారు. ఇంగ్లండ్పై చరిత్రాత్మక విజయంతో ఆత్మవిశ్వాసంతో ఉన్న టీమ్ఇండియా..ఆస్ట్రేలియాతో అదే పోరాటపటిమ కనబరుస్తున్నది. ఓపెనర్ స్మృతి మందన(74), జెమీమా రోడ్రిగ్స్(73), దీప్తిశర్మ(70 నాటౌట్), రీచా ఘోష్(52) అర్ధసెంచరీలతో కదంతొక్కడంతో శుక్రవారం రెండో రోజు ఆట ముగిసే సరికి తొలి ఇన్నింగ్స్లో 376/7 స్కోరు చేసింది. దీప్తితో పాటు వస్ర్తాకర్(33 నాటౌట్) క్రీజులో ఉన్నారు. గార్డ్నర్(4/100) నాలుగు వికెట్లు దక్కించుకుంది.
ఓవర్నైట్ స్కోరు 98/1తో రెండో రోజు ఆట కొనసాగించిన ఓవర్నైట్ బ్యాటర్లలో మందన నిలకడగా ఆడినా.. స్నేహ్ రాణా (9) విఫలమైంది. మందన 68 బంతుల్లో అర్ధసెంచరీ పూర్తి చేసుకుంది. అయితే 35వ ఓవర్లో రాణా ఔట్ కావడంతో 50 పరుగుల భాగస్వామ్యానికి బ్రేక్ పడింది. అరంగేట్రం బ్యాటర్ రీచా ఘోష్తో కలిసి ఇన్నింగ్స్ను మందన ముందుకు తీసుకెళ్లింది. ఈ క్రమంలో రిచాతో నెలకొన్న సమన్వయం లోపంతో మందన రనౌట్గా వెనుదిరుగడంతో 147 వద్ద భారత్ మూడో వికెట్ కోల్పోయింది. ఆసీస్ బౌలర్లకు పరీక్షకు పెడుతూ జెమీమా, రీచా సాధికారిక ఇన్నింగ్స్తో ఆకట్టుకున్నారు. ఆఖర్లో దీప్తి, పూజతో కలిసి విలువైన పరుగులు రాబట్టింది.