న్యూఢిల్లీ: వెస్టిండీస్, అమెరికాలో వచ్చే నెల నుంచి జరుగనున్న టీ20 వరల్డ్కప్ కోసం భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) జట్టును ప్రకటించింది. పొట్టి ప్రపంచకప్లో జట్ల ప్రకటనకు ఆఖరి తేదీ నేటి (మే 1)తో ముగియనుండగా అజిత్ అగార్కర్ నేతృత్వంలోని ఆలిండియా సెలక్షన్ కమిటీ మంగళవారం అహ్మదాబాద్లో సమావేశమై జట్టును ఎంపికచేసింది. రోహిత్శర్మ సారథ్యంలోని 15 మంది సభ్యులు గల టీమిండియాకు హార్దిక్ పాండ్యా వైస్ కెప్టెన్గా వ్యవహరిస్తాడు. జట్టు ఎంపికలో భాగంగా వికెట్ కీపర్ రిషభ్ పంత్ 14 నెలల తర్వాత భారత జట్టులోకి పునరాగమనం చేశాడు. 2023 ఆగస్టు తర్వాత లెగ్ స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్ ‘మెన్ ఇన్ బ్లూ’తో కలవనుండగా సంజూ శాంసన్ రెండో వికెట్ కీపర్గా ఎంపికయ్యాడు.
ఫామ్లేమితో తంటాలు పడుతున్న హార్దిక్నూ, ఐపీఎల్ తాజా సీజన్లో ఆశించిన స్థాయిలో రాణించలేకపోతున్న యువ సంచలనం యశస్వీ జైస్వాల్ పైనా సెలక్టర్లు నమ్మకముంచారు. ఐపీఎల్లో సిక్సర్ల సునామీతో రెచ్చిపోతున్న శివమ్ దూబే కూడా జట్టులో స్థానం నిలుపుకున్నాడు. రోహిత్, కోహ్లీ, జైస్వాల్, సూర్యకుమార్ యాదవ్, పంత్, దూబే బ్యాటింగ్ భారాన్ని మోయనున్నారు. హార్దిక్, దూబే సీమ్ ఆల్రౌండర్లు కాగా జడేజా, అక్షర్ పటేల్ స్పిన్ ఆల్రౌండర్లుగా ఉన్నారు. చాహల్, కుల్దీప్ స్పిన్ బాధ్యతలు మోయనుండగా పేస్ విభాగానికి బుమ్రా నాయకత్వం వహించనున్నాడు. ఐపీఎల్లో దారుణంగా విఫలమవుతున్నా మహ్మద్ సిరాజ్, అర్ష్దీప్ సింగ్ జట్టులో చోటు దక్కించుకున్నారు.
రెండో వికెట్ కీపర్గా సంజూ శాంసన్ వైపు మొగ్గుచూపిన సెలక్టర్లు కెఎల్ రాహుల్ను పక్కనబెట్టారు. రాహుల్తో పాటు శుభ్మన్ గిల్, రింకూ సింగ్, ఐపీఎల్లో నిలకడగా ఆడుతున్న రుతురాజ్, మణికట్టు స్పిన్నర్ రవి బిష్ణోయ్కూ నిరాశ తప్పలేదు. అయితే ప్రధాన జట్టులో చోటు దక్కకపోయినా గిల్, రింకూ, అవేశ్ ఖాన్, ఖలీల్ అహ్మద్ రిజర్వ్ బెంచ్లో ఉన్నారు.
భారత జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), హార్దిక్ పాండ్యా (వైస్ కెప్టెన్), యశస్వీ జైస్వాల్, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, రిషభ్ పంత్, సంజూ శాంసన్, శివమ్ దూబే, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, యుజ్వేంద్ర చాహల్, అర్ష్దీప్ సింగ్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్.
రిజర్వ్ : గిల్, రింకూ, ఖలీల్, అవేశ్
నమస్తే తెలంగాణ క్రీడావిభాగం : ఒంటినిండా గాయాలు.. శరీరం నుంచి ఏకధారలా కారుతున్న రక్తం.. డిసెంబర్ మాసంలో ఉత్తరాది మంచు కారణంగా ఉదయం ఐదు గంటలైనా జనం ఇంకా నిద్రలేవని సమయాన ఎక్కడున్నాడో, ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాడో తెలియని స్థితి. ఘోర రోడ్డు ప్రమాదం కారణంగా చావు అంచుల దాకా వెళ్లొచ్చి.. నాలుగు రోజు లు గడిస్తే గానీ ‘ప్రాణాలకు ప్రమాదమేమీ లేదుగానీ ఇప్ప ట్లో నడవలేడు’ అన్న పిడుగులాంటి వార్త. మూడు నెలల పాటు బెడ్ దిగలేదు. అయినా ఆ యోధుడు పోరాటాన్ని వీడలేదు. అప్పుడు అతడి పరిస్థితి చూసి ‘ఇప్పట్లో భారత జట్టులోకి రావడం కష్టమే!’ అని పెదవివిరిచినవాళ్లే ఎక్కువ. కానీ ఆ కుర్రాడు కెరటంలా దూసుకొచ్చాడు. అతడే రిషభ్ పంత్.
చేతికర్ర సాయంతోనే బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీ (ఎన్సీఏ)లో చేరి అక్కడ వైద్యులు, ఫిట్నెస్ గురువుల సమక్షంలో తనను తాను రాటుదేల్చుకున్నాడు. ఒక క్రమపద్ధతిలో మళ్లీ పూర్తి ఫిట్నెస్ సాధించి ఏడాది తర్వాత ఐపీఎల్-17లో రీఎంట్రీ ఇచ్చిన అతడు ఈ సీజన్లో తన పునరాగమనాన్ని ఘనంగా చాటుతున్నాడు. తనదైన ఒంటిచేతి సిక్సర్లు, వికెట్ల వెనుక విన్యాసాలు ఒక ఎత్తైతే వికెట్ల మధ్య పంత్ పరుగెత్తుతున్న తీరు చూసి అసలు రోడ్డు ప్రమాదంలో రెండు కాళ్లకూ గాయాలయ్యింది ఇతడికేనా..? అన్న అనుమానం రాక మానదు. తాజాగా 14 నెలల తర్వాత పంత్ మళ్లీ భారత జట్టులోకి వచ్చాడు. రోడ్డు ప్రమాదమైన 2022 డిసెంబర్ 30 నుంచి 14 నెలల తర్వాత భారత జట్టులోకి రీఎంట్రీ ఇచ్చేదాకా అతడి ప్రయాణం స్ఫూర్తిదాయకం!
టీ20 ప్రపంచకప్ టోర్నీ కోసం ఎంపిక చేసిన భారత జట్టు సభ్యుల పేర్లు న్యూయార్క్లోని ప్రఖ్యాత అంపైర్స్టేట్ బిల్డింగ్పై మంగళవారం ప్రదర్శించిన దృశ్యమిది.