న్యూఢిల్లీ: టీమ్ఇండియా టీ20 కెప్టెన్ హార్దిక్పాండ్యాపై సోషల్మీడియాలో అభిమానులు దుమ్మెత్తిపోస్తున్నారు. మంగళవారం వెస్టిండీస్తో జరిగిన కీలకమైన మూడో టీ20 మ్యాచ్లో హార్దిక్ వ్యవహరించిన తీరును తీవ్రంగా తప్పుబడుతున్నారు. ఐపీఎల్తో పాటు దేశవాళీ టోర్నీల్లో నిలకడగా రాణిస్తూ జట్టులోకి వచ్చిన హైదరాబాద్ యువ క్రికెటర్ ఠాకూర్ తిలక్వర్మ.. విండీస్తో టీ20 సిరీస్లో దుమ్మురేపుతున్నాడు. అరంగేట్రం మ్యాచ్లోనే ఔరా అనిపించిన ఈ యువ కెరటం..వరుస మ్యాచ్ల్లో కీలక ఇన్నింగ్స్లతో ఆకట్టుకుంటున్నాడు. అయితే విండీస్తో మూడో మ్యాచ్లోనూ తిలక్ అద్భుత ఇన్నింగ్స్తో టీమ్ఇండియాను సిరీస్లో నిలబెట్టాడు.
సూర్యకుమార్తో కలిసి మూడో వికెట్కు 87 పరుగులు జోడించాడు. ఓవైపు సూర్యకుమార్ నిష్క్రమించినా తాను ఉన్నానంటూ భరోసా కల్పిస్తూ ఇన్నింగ్స్ను ముందుకు నడిపించాడు. ఇంత వరకు బాగానే ఉంది..విండీస్ బౌలర్లను ఉతికి ఆరేస్తూ పరుగులు కొల్లగొడుతున్న వర్మ దూకుడుకు కెప్టెన్ పాండ్యా బ్రేక్లు వేశాడు. గెలిచే వరకు క్రీజులో ఉండూ అంటూ హితబోధ చేసిన పాండ్యా..చివరికి వర్మను అర్ధసెంచరీ చేయనీయకుండానే పావెల్ బౌలింగ్లో సిక్స్తో మ్యాచ్ ముగించాడు. దీంతో వరుసగా రెండో మ్యాచ్లో అర్ధసెంచరీ సాధిద్దామనుకున్న వర్మకు పాండ్యా స్వార్థపూరిత వైఖరితో చుక్కుదురైంది. దీనిపై అభిమానులు పాండ్యాను ఓ ఆటాడుకున్నారు. ఇది సరైన పద్ధతికాదు అంటూ విమర్శలు సంధించారు.