ప్రస్తుతం భారత జట్టులో యువ ఆటగాళ్లకు కొదవలేదు. తమకు దక్కిన ప్రతి అవకాశాన్ని ఉపయోగించుకునేందుకు వాళ్లు ప్రయత్నిస్తున్నారు. తాజాగా ముగిసిన సౌతాఫ్రికా సిరీస్లో ఇషాన్ కిషన్ అద్భుతంగా రాణించాడు. మరో ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ కూడా ఫర్వాలేదనిపించాడు.
కానీ టీమిండియా రెగ్యులర్లు రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్, విరాట్ కోహ్లీ వస్తే మాత్రం.. వీళ్లంతా సైడ్ అయిపోయి వాళ్లకు దారి ఇవ్వాల్సిందే. ఈ ముగ్గురూ కూడా ప్రపంచ స్థాయి ఆటగాళ్లు అనడంలో ఎవరికీ ఎలాంటి అనుమానాలూ లేవు. కానీ టీ20 ఫార్మాట్లో వీళ్ల స్ట్రైక్ రేట్ గమనిస్తే చాలా వెనుకబడినట్లు తెలిసిపోతుంది. ఇదే విషయమై మాజీ క్రికెటర్, సెలెక్షన్ కమిటీ మాజీ సభ్యుడు సాబా కరీమ్ ముందు ప్రస్తావించగా.. ఆయన షాకింగ్ కామెంట్స్ చేశాడు.
ఈ ముగ్గురు మంచి అనుభవం ఉన్న ఆటగాళ్లని, కాబట్టి జట్టు అవసరాలకు తగినట్లు తమ ఆటలో మార్పులు చేసుకోవాల్సి ఉంటుందని సాబా కరీమ్ సూచించాడు. ఈ విషయంపై సెలెక్టర్లు కఠినంగా వ్యవహరించాలని, ఈ టాప్ ఆటగాళ్లతో సీరియస్గా చర్చించాలని చెప్పాడు. అద్భుతమైన అనుభవం ఉన్న వీళ్లు చిన్న చిన్న మార్పులతోనే కావలసిన ఫలితాలు తీసుకురాగలరని, మోడ్రన్ క్రికెట్కు అనుగుణంగా టెక్నిక్ మార్చుకోవాల్సి ఉంటుందని వివరించాడు. ప్రస్తుతం రోహిత్, కోహ్లీ ఇద్దరూ ఇంగ్లండ్ పర్యటనలో ఉండగా.. రాహుల్ గాయంతో ఈ సిరీస్కు దూరమయ్యాడు.