Team India | దుబాయ్: ప్రతిష్ఠాత్మక చాంపియన్స్ ట్రోఫీని ముచ్చటగా మూడోసారి దక్కించుకోవాలన్న పట్టుదలతో ఉన్న టీమ్ఇండియా అందుకు తగ్గట్లు వ్యూహాలు రచిస్తున్నది. మెగాటోర్నీలో ఓటమి అన్నది ఎరుగకుండా అజేయంగా దూసుకెళుతున్న రోహిత్సేన..ఫైనల్లో న్యూజిలాండ్ను ఎదుర్కొనుంది. ఇందుకోసం టీమ్ఇండియా క్రికెటర్లు ప్రాక్టీస్లో చెమటోడుస్తున్నారు.
ఐసీసీ మెగాటోర్నీల్లో తమకు కొరకరాని కొయ్యగా మారిన కివీస్కు ఎలాగైనా చెక్ పెట్టాలన్న ఉన్న భారత్ శుక్రవారం ప్రాక్టీస్లో మునిగి తేలింది. లీగ్ దశలో న్యూజిలాండ్ను ఓడించిన టీమ్ఇండియా అదే రీతిలో ఆదివారం జరిగే పోరులోనూ సత్తాచాటాలని చూస్తున్నది. చాంపియన్స్ ట్రోఫీలో తమ మ్యాచ్లన్నీ దుబాయ్లో ఆడుతుండటం మనకు కలిసొచ్చే అంశం కాగా, కివీస్కు ఇక్కడి పరిస్థితులు కొత్తగా ఉన్నాయి. ఇదిలా ఉంటే బలబలాల పరంగా చూస్తే ఇరు జట్లు సమవుజ్జీలుగా కనిపిస్తున్నా..మ్యాచ్ రోజు అదృష్టం ఎవరిని వరిస్తుందనేది ఆసక్తికరంగా మారింది.
ప్రస్తుత టీమ్ ఫామ్ చూస్తే బ్యాటింగ్, బౌలింగ్ పరంగా కివీస్ కంటే మెరుగ్గా కనిపిస్తున్నది. బ్యాటింగ్లో కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, రాహుల్, రోహిత్, గిల్, హార్దిక్ వీరిలో ఏ ఇద్దరు నిలదొక్కుకున్నా..మ్యాచ్ స్వరూపం మారిపోవడం ఖాయం. కివీస్ విషయానికొస్తే..రచిన్ రవీంద్ర, విలియమ్సన్ సూపర్ ఫామ్మీదున్నారు. హెన్రీ గాయం జట్టును కలవరపెడుతున్నది.