IND Vs WI | కుడి ఎడమల ఓపెనింగ్ జోడీ దంచికొట్టడంతో వెస్టిండీస్తో రెండో టెస్టులో టీమ్ఇండియాకు శుభారంభం దక్కింది. గత మ్యాచ్లో సెంచరీలతో కదంతొక్కిన రోహిత్ శర్మ, యశస్వి జైస్వాల్ ఈసారి అర్ధశతకాలతో రాణించడంతో పోర్ట్ ఆఫ్ స్పెయిన్లో భారత్ భారీ స్కోరు దిశగా దూసుకెళ్తున్నది. భారత్, వెస్టిండీస్ మధ్య ఇది వందో టెస్టు మ్యాచ్ కాగా.. మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ తన 500వ అంతర్జాతీయ మ్యాచ్లో బరిలోకి దిగాడు.
పోర్ట్ ఆఫ్ స్పెయిన్: తొలి టెస్టులో ఘనవిజయం సాధించిన భారత జట్టు.. రెండో టెస్టులోనూ గట్టి పునాది వేసుకుంటున్నది. రెండు మ్యాచ్ల సిరీస్లో 1-0తో ముందంజలో ఉన్న టీమ్ఇండియా.. రెండో పోరులో టాస్ ఓడి మొదట బ్యాటింగ్కు దిగింది. పేస్కు సహకరిస్తున్న పిచ్పై తొలి రోజు టీ సమయానికి రోహిత్ సేన తొలి ఇన్నింగ్స్లో 4 వికెట్ల నష్టానికి 182 పరుగులు చేసింది. గత మ్యాచ్లో అరంగేట్ర టెస్టు ఆడుతూ భారీ సెంచరీ బాదిన యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్.. ఈసారి అర్ధశతకం (74 బంతుల్లో 57; 9 ఫోర్లు, ఒక సిక్సర్)తో రాణించాడు. మరో సెంచరీ చేసేలా కనిపించిన కెప్టెన్ రోహిత్ శర్మ (143 బంతుల్లో 80; 9 ఫోర్లు, 2 సిక్సర్లు) వారికన్ ఓవర్లో వికెట్ సమర్పించుకున్నాడు. వీరిద్దరూ తొలి వికెట్కు 139 పరుగులు చేసి జట్టుకు శుభారంభం అందించారు. తొలి సెషన్లో 26 ఓవర్ల పాటు బ్యాటింగ్ చేసిన టీమ్ఇండియా ఓపెనర్లు.. కరీబియన్ బౌలర్లను ఓ ఆటాడుకున్నారు. ధనాధన్ షాట్లతో 4.65 రన్రేట్తో పరుగులు రాబట్టడం విశేషం. రెండో సెషన్లో ఆకట్టుకున్న విండీస్ 4 వికెట్లు పడగొట్టి తిరిగి పోటీలోకి వచ్చింది. శుభ్మన్ గిల్ (10), అజింక్యా రహానే (8) వరుసగా రెండో మ్యాచ్లోనూ ఆకట్టుకోలేకపోయారు. 500వ అంతర్జాతీయ మ్యాచ్ ఆడుతున్న మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ (18) పోరాడుతున్నాడు. విండీస్ బౌలర్లలో రోచ్, హోల్డర్, వారికెన్, గాబ్రియెల్ తలా ఒక వికెట్ పడగొట్టారు.
భారత్, వెస్టిండీస్ మధ్య ఇది వందో టెస్టు మ్యాచ్ కాగా.. ఇప్పటి వరకు టీమ్ఇండియా ఆస్ట్రేలియా, ఇంగ్లండ్తో వందేసి టెస్టు మ్యాచ్లు ఆడింది. వందో మ్యాచ్ సందర్భంగా ఇరు జట్ల కెప్టెన్లకు వెస్టిండీస్ క్రికెట్ బోర్డు తరఫున క్రికెట్ దిగ్గజం బ్రియాన్ లారా ప్రత్యేక జ్ఞాపిక అందజేశాడు.
ఈ మ్యాచ్ ద్వారా బెంగాల్ పేసర్ ముఖేశ్ కుమార్ అంతర్జాతీయ టెస్టు అరంగేట్రం చేశాడు. పేస్ ఆల్రౌండర్ శార్దూల్ ఠాకూర్ గాయపడటంతో అతడి స్థానంలో ముఖేశ్కు అవకాశమిచ్చినట్లు భారత కెప్టెన్ రోహిత్ శర్మ తెలిపారు. మ్యాచ్ ఆరంభానికి ముందు సీనియర్ ఆఫ్స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్.. అతడికి టెస్టు క్యాప్ అందించి జట్టులోకి స్వాగతం పలికాడు.