Team India : వన్డే వరల్డ్ కప్ తర్వాత సొంత గడ్డపై జరుగుతున్నఐదు టీ20ల సిరీస్(T20 Series)లో యువకులతో నిండిన భారత జట్టు(Team India) ఆస్ట్రేలియాను కంగారెత్తిస్తోంది. రెండు మ్యాచుల్లో ఆసీస్ను చిత్తు చేసిన సూర్యకుమార్ సేన సిరీస్లో 2-0తో ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. తిరువనంతపురంలో
కంగారూలపై 44 పరుగుల తేడాతో గెలిచిన భారత్ పొట్టి క్రికెట్లో 135 విజయం నమోదు చేసింది.
తద్వారా ఈ ఫార్మాట్లో అత్యధిక విజయాలతో దాయాది పాకిస్థాన్ రికార్డు సమం చేసింది. 2006 నుంచి ఇప్పటివరకూ 211 టీ20ల ఆడిన టీమిండియా 135 మ్యాచుల్లో జయకేతనం ఎగురవేసింది. ఇక పాక్.. 226 మ్యాచుల్లో 135 సార్లు గెలుపొందింది. న్యూజిలాండ్ జట్టు 200 మ్యాచుల్లో 102 విజయాలతో మూడో స్థానంలో కొనసాగుతుండగా.. దక్షిణాఫ్రికా 95, ఆస్ట్రేలియా 94 విజయాలతో వరుసగా నాలుగు, ఐదు స్థానాల్లో నిలిచాయి.
ఐసీసీ 2007లో తొలిసారి నిర్వహించిన టీ20 వరల్డ్ కప్లో భారత్ విజేతగా నిలిచింది. ఎంఎస్ ధోనీ సారథ్యంలోని యువ భారత్ ఫైనల్లో పాకిస్థాన్ను చిత్తు చేసి ట్రోఫీని ముద్దాడింది. అక్కడితో మొదలు పొట్టి ఫార్మాట్లో టీమిండియా ఆధిపత్యం చెలాయిస్తూ వస్తోంది. సొంతగడ్డపై ఈ ఏడాది శ్రీలంక, న్యూజిలాండ్తో జరిగిన టీ20 సిరీస్లో భారత జట్టుకు ఎదురన్నదే లేకుండా పోయింది.
యశస్వీ జైస్వాల్, రుతురాజ్, ఇషాన్
వచ్చే ఏడాది వెస్టిండీస్, అమెరికా గడ్డపై జరుగనున్న టీ20 వరల్డ్ కప్పై కన్నేసిన భారత జట్టు యువకులను సానబెడుతోంది. ఆసీస్తో జరుగుతున్న ఐదు టీ20ల సిరీస్లో యువకెరటాలు యశస్వీ జైస్వాల్, రుతురాజ్ గైక్వాడ్, ఇషాన్ కిషన్, రింకూ సింగ్ బ్యాటుతో బాదేస్తుంటే.. రవి బిష్ణోయ్, ముకేశ్ కుమార్, అక్షర్ పటేల్ బంతితో కంగరూలను వణికిస్తున్నారు.