Posani Krishna Murali | సీమాంధ్ర సోదరులను కేసీఆర్ కడుపులో పెట్టి చూసుకున్నారు. తెలంగాణ వస్తే అది జరుగుతుంది.. ఇది జరుగుతుంది.. అని గత పాలకులు సీమాంధ్రులను భయభ్రాంతులకు గురిచేశారు. కానీ ఈ పదేండ్లలో అలాంటి ఘటన ఏదైనా జరిగిందా? అన్నదమ్ముల్లా అందరూ ప్రశాంతంగా ఉన్నారు. గతంలో కంటే ఉపాధి అవకాశాలు పెరిగాయి. వ్యాపారాలూ సాగుతున్నాయి. అందుకే ఓటు వేసే ముందు సీమాంధ్ర సోదరులు ఒక్కసారి ఆలోచించాలని చెబుతున్నారు ప్రముఖ సినీ నటుడు పోసాని కృష్ణమురళి. ఈ ప్రాంత అభ్యున్నతిని కాంక్షించే వ్యక్తిగా.. అభివృద్ధిని మాత్రమే చూసి ఓటు వేస్తానని చెబుతున్న ఆయన ‘నమస్తే తెలంగాణ’తో ముచ్చటించారు.
ఇక్కడివారు ఎలా ఉద్యమించారని మీరు భావిస్తున్నారు?
దేశంలో రాష్ర్టాల విభజన కోసం చాలా ఉద్యమాలు జరిగాయి. వాటిలో ఆయా ప్రాంతాల్లో ఉంటున్న స్థానికేతరులను జుట్టుపట్టి కొట్టి, ఆస్తులు ధ్వంసం చేసి, అవసరమైతే హత్యలు చేసిన చరిత్రలున్నాయి. కానీ, తెలంగాణ ఉద్యమంలో ఒక్క ఆంధ్రా ప్రాంతపు బిడ్డ రక్తం కూడా చిందలేదు. వేలాది మంది విద్యార్థులు లాఠీ దెబ్బలు తిన్నా.. మా పిల్లలపై ఒక్క దెబ్బ కూడా పడలేదు. స్వరాష్ట్రం కోసం వారు ప్రాణాలు తీసుకున్నారే కానీ.. ఆంధ్రోళ్లను పల్లెత్తు మాట అనలేదు.
హైదరాబాద్ అభివృద్ధిపై ఏమంటారు?
నేడు బడికి పోతే విద్యార్థిలా, గుడికిపోతే భక్తుడిలా.. తెలంగాణకు వస్తే తెలంగాణ బిడ్డగా ఉంటా. దేశం మొత్తాన్ని తనవైపు తిప్పుకొనేలా హైదరాబాద్ను అభివృద్ధి చేశారు సీఎం కేసీఆర్. నగరవ్యాప్తంగా విశాలమైన రోడ్లు, ఫ్లై ఓవర్లు, మెట్రో, ఐటీ పరిశ్రమలతో హైదరాబాద్ అలరారుతున్నది. అనతికాలంలోనే హైదరాబాద్ న్యూయార్క్ను తలదన్నేలా అభివృద్ధి చెందింది.
‘మిషన్ భగీరథ’ నీళ్లు ఎప్పుడైనా తాగారా?
అన్నా మంచి ప్రశ్న అడిగారు (నవ్వుతూ). ఈ దేశంలో మన తెలంగాణలో మాత్రమే మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికీ తాగునీరు అందుతున్నది. నాడు మేమంతా ట్యాంకర్ నీళ్లు పట్టుకుంటే.. ఇప్పుడు ట్యాపులు తిప్పితే ప్రతిరోజూ నీళ్లు వస్తున్నాయి. మిషన్ భగీరథ గురించి ఎంత చెప్పినా తక్కువే. కానీ.. నెహ్రూ నుంచి నేటి ప్రధాని వరకూ ఎవ్వరూ చెయ్యని ఓ గొప్ప పని.. నల్లగొండ, తెలంగాణ నుంచి ఫ్లోరైడ్ను పారదోలడం. అది కేసీఆర్కే సాధ్యమయ్యింది.
మేడిగడ్డపై ప్రతిపక్షాల ఆరోపణలను మీరెలా చూస్తారు?
తెలంగాణలోని కొందరు ప్రతిపక్ష నాయకులకు ముందుగా కాళేశ్వరం ఏమిటి? మేడిగడ్డ ఏంటి? అనే క్లారిటీ రావాలి. కోట్ల రూపాయల అవినీతి అంటున్నారు కానీ.. ఎక్కడ జరిగింది? ఎలా జరిగింది? అనేది మాత్రం నిరూపించలేకపోతున్నారు. నదిలో కట్టిన మేడిగడ్డ బరాజ్కు సంబంధించిన ఒక పిల్లర్ కుంగిపోతే ఊళ్లు ఎలా మునిగిపోతాయి? ఒకవేళ ఏదైనా సమస్య అయితే అది ఇంజినీరింగ్ లోపంగా చూడాలి. కొన్ని రాష్ర్టాల్లో బ్రిడ్జిలే కూలిపోతున్నాయి. మరి ఎంతమంది సీఎంలను జైళ్లో పెట్టారు?. మా దగ్గర పోలవరం కట్టడానికి ముఖ్యమంత్రులే మారారు.
మలి దశ తెలంగాణ ఉద్యమం గురించి ఏం చెబుతారు?
తెలంగాణ బిడ్డల అమాయకత్వాన్ని కొందరు ఆంధ్రా ప్రాంత నాయకులు క్యాష్ చేసుకున్నారు. ఇక్కడి సంపదను దోచుకుతింటున్నా ఇక్కడి ప్రజలు ఏమీ చేయలేని పరిస్థితి. ఆఖరికి నీళ్లు తరలించుకున్నా, నిధులు మళ్లించినా.. నియామకాల్లో ద్రోహం చేసినా కిక్కురుమనలేదు. తెలంగాణకు తామే నాగరికత నేర్పించామని, సన్నబియ్యం తినడం, సరైన బట్ట కట్టడం, ఎలా బతకాలో చూపించామనే ధోరణిని విస్తృతం చేయడం.. ఇక్కడి వారిని కాలి కింద చెప్పులా చూస్తుండటాన్ని తట్టుకోలేకనే ఉద్యమించారు. ఎంతోమంది స్వరాష్ట్రం కోసం ప్రాణత్యాగాలు చేశారు. వారి ఆత్మబలిదానాలు చూడలేకనే.. చివరి చావు తనదే కావాలని కేసీఆర్ ఉద్యమించారు. చావు అంచుల దాకా వెళ్లారు. అందువల్లనే తెలంగాణ ఇచ్చారు. ఇప్పుడేదో కాంగ్రెస్ నాయకులు తెలంగాణపై ప్రేమ ఉన్నట్టు మాట్లాడుతుండటం కపట ప్రేమనే చెప్పాలి.
ప్రత్యేక రాష్ట్రం తర్వాత మీరు గమనించిన పరిస్థితులు?
నాటి, నేటి తెలంగాణ పరిస్థితులపై నాకు చాలా అవగాహన ఉన్నది. నాడు ఎద్దు ఏడ్చింది.. ఎవుసం ఏడ్చింది. ఓ వైపు ఎండిన పంటలు, పేదరికం, రైతు ఆత్మహత్యలు, మరోవైపు వలస బతుకులు. నేడు దేశంలో అందరికంటే ఎక్కువ సంతోషంతో ఉన్నది తెలంగాణ రైతులే. రైతుబంధు ఇచ్చి రైతన్నలను ఆదుకున్న నాయకుడు ఎవరైనా ఉన్నారా? రైతు లక్ష్యంగా ఆయన తీసుకొచ్చిన పథకాలు తెలంగాణ గ్రామీణ వ్యవస్థలో సమూల మార్పులు తీసుకొచ్చాయి. పల్లెల్లో చెరువులు నీళ్లతో కళకళలాడుతున్నాయి. పచ్చని పంట పొలాలు కనిపిస్తున్నాయి. రాత్రింబవళ్లు కరెంటు ఉంటున్నది. మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ, హరితహారంతో ఊళ్ల్లు కొత్త కళను సంతరించుకున్నాయి.
తెలంగాణలో సెటిలర్స్కు మీరిచ్చే సందేశం?
20 ఏండ్లపాటు పెద్దఎత్తున తెలంగాణ ఉద్యమం జరిగినా.. ఆంధ్రా సహా ఇతర ప్రాంతాల సెటిలర్స్ను తన బిడ్డల లెక్క కాపాడారు కేసీఆర్. ఎందుకు ఆయనకు ఓటు వేయకూడదు? తండ్రిలాగా ఎంతలా మాట్లాడుతారో.. కొడుకులాగా అంతే కరిగిపోతారాయన (గుండెమీద చెయ్యి వేసుకొని). దయచేసి నా విన్నపం ఒక్క టే.. మీరంతా కులమతాలకు అతీతంగా ఆలోచించి, మంచివారు ఎవరు? అభివృద్ధి చేసింది ఎవరు? మనల్ని కాపాడుతున్నది ఎవరు? అనేది గుర్తించి ఓటు వేయాలి.
…?రవికుమార్ తోటపల్లి