Emerging Asia Cup 2023 : పురుషుల ఎమర్జింగ్ ఆసియా కప్లో భారత యువ జట్టు(India A Team) అదరగొడుతోంది. వరుసగా రెండో మ్యాచ్లో భారీ విజయం సాధించింది. తొలి మ్యాచ్లో యూఏఈ(UAE) ఏ జట్టును చిత్తు చేసిన భారత ఏ జట్టు.. ఈరోజు నేపాల్(Nepal)పై గెలుపొందింది. ప్రేమదాస స్టేడియం (R.Premadasa Stadium)లో జరిగిన మ్యాచ్లో తొమ్మిది వికెట్ల తేడాతో నేపాల్పై నెగ్గింది.
స్వల్ప లక్ష్య ఛేదనలో భారత ఓపెనర్లు సాయి సుదర్శన్(58 నాటౌట్), అభిషేక్ శర్మ(87) హాఫ్ సెంచరీలతో మెరిశారు. అభిషేక్ తర్వాత వచ్చిన ధ్రువ్ జురెల్(21 నాటౌట్) సిక్స్ కొట్టి మ్యాచ్ గెలిపించాడు. మొదట బ్యాటింగ్ చేసిన నేపాల్ను భారత బౌలర్ నిషాంత్ సింధు(Nishant Sindhu) వణికించాడు. అతను నాలుగు వికెట్లతో చెలరేగడంతో నేపాల్ 167 పరుగులకే ఆలౌటయ్యింది. కెప్టెన్ రోహిత్ పౌడెల్(65) అర్ధ శతకం బాది జట్టుకు పోరాడగలిగే స్కోర్ అందించాడు. భారత బౌలర్లలో హంగర్గేకర్ మూడు, హర్షిత్ రానా రెండు వికెట్లు పడగొట్టారు.
2️⃣ wins in a row for India ‘A’ 🙌
A clinical chase ensures a nine-wicket win against Nepal 👏
Scorecard – https://t.co/XoxpSdeexC…#ACCMensEmergingTeamsAsiaCup | #ACC pic.twitter.com/wehE5JRIVH
— BCCI (@BCCI) July 17, 2023
లక్ష్యం చిన్నదే అయినప్పటికీ భారత ఓపెనర్లు సాయి సుదర్శన్(58 నాటౌట్), అభిషేక్ శర్మ(87) ధనాధన్ ఆడారు. గత మ్యాచ్లో విఫలమైన వీళ్లు అర్ధ శతకాలతో స్కోర్ బోర్డును పరుగులు పెట్టించారు. అయితే.. అభిషేక్ను రోహిత్ పౌడెల్ బోల్తా కొట్టించాడు. ఆ తర్వాత వచ్చిన ధ్రువ్ జురెల్(21 నాటౌట్), సుదర్శన్ మరింత ధాటిగా ఆడారు. దాంతో, భారత్ 22.1 ఓవర్లలోనే ఒక వికెట్ కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. తొలి మ్యాచ్లో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ఏ జట్టుపై టీమిండియా ఏ ఘన విజయం సాధించింది. విధ్వంసక ఇన్నింగ్స్ ఆడిన కెప్టెన్ యశ్ ధుల్ (108) సెంచరీతో జట్టును గెలిపించాడు.