Asia cup 2023 : ఆసియా కప్ నిర్వహణకు ఉన్న అన్ని అడ్డంకులు తొలగిపోయాయి. ఈ వారంలోపు షెడ్యూల్ రానుందని పాకిస్థాన్ క్రికెట్ బోర్డు(Pakistan Cricket Board) వెల్లడించింది. అంతేకాదు ఆరంభ మ్యాచ్కు పాకిస్థాన్ ఆతిథ్యం ఇవ్వనుందని తెలిపింది. ‘దుబాయ్లో జూలై 15న సమావేశమైన ఆసియన్ క్రికెట్ కౌన్సిల్ (Asian Cricket Council), పీసీబీ పెద్దలు ఆసియా కప్ తుది షెడ్యూల్పై చర్చించారు. అంతేకాదు టోర్నీ నిర్వహణ, ఏర్పాట్లు, మార్కెటింగ్ క్యాంపెయిన్ గురించి కూడా మాట్లాడారు’ అని పీసీబీ ఒక ప్రకటనలో చెప్పింది.
అయితే.. రెండు రోజుల క్రితం పీసీబీ అధ్యక్షుడు జకా అష్రఫ్( Zaka Ashraf) తమదేశంలో నాలుగు కంటే ఎక్కువ మ్యాచ్లు నిర్వహించాలని ఏసీసీని కోరుతామని చెప్పాడు. కానీ ఏసీసీ సభ్యులు అందుకు అంగీకరించారా? లేదా? అనేది మాత్రం పీసీబీ వెల్లడించలేదు.
ఈ ఏడాది ఆసియా కప్ను హైబ్రిడ్ మోడల్(Hybrid Model)లో నిర్వహించేందుకు ఏసీసీ ఆమోద ముద్ర వేసిన విషయం తెలిసిందే. శ్రీలంక, పాకిస్థాన్ వేదికగా టోర్నమెంట్ జరగనుంది. ఆసియా కప్ ఆగస్టు 31 నుంచి సెప్టెంబర్ 17 వరకు జరుగనుంది. పాక్లో 4 మ్యాచ్లు, లంక గడ్డపై 9 మ్యాచ్లు నిర్వహిస్తారు. భారత్, బంగ్లాదేశ్, శ్రీలంక, పాకిస్థాన్, అఫ్గనిస్థాన్, నేపాల్ టైటిల్ కోసం పోటీపడనున్నాయి.
భారత్, పాకిస్థాన్
పాక్, ఇండియా, నేపాల్ ఒక గ్రూప్లో.. బంగ్లాదేశ్, శ్రీలంక, అఫ్గనిస్థాన్ మరో గ్రూప్లో ఉన్నాయి. ప్రతి గ్రూప్ నుంచి రెండు జట్లు సూపర్ 4 దశకు అర్హత సాధిస్తాయి. నిరుడు ఆతిథ్య లంక విజేతగా నిలిచిన విషయం తెలిసిందే. ఉత్కంఠ రేపిన ఫైనల్లో దసున్ షనక(Dasun Shanaka) బృందం పాకిస్థాన్ను ఓడించి ట్రోఫీ సొంతం చేసుకుంది.