Arvind Kejriwal : కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఈ20 పెట్రోల్కు వ్యతిరేకంగా భారీ ఆందోళనకు ఆప్ కన్వీనర్, ఢిల్లీ మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ సిద్ధమవుతున్నారు. ఆగష్టు 4న ప్రధాని మోదీ నివాసం వరకు మార్చ్ నిర్వహించనున్నట్లు ఆయన వెల్లడించారు. ఈ సందర్భంగా రెండు లక్షల మంది సంతకాలతో కూడిన పిటిషన్ను అందజేస్తామని పేర్కొన్నారు. న్యూఢిల్లీలో శనివారం జరిగిన ఒక కార్యక్రమంలో కేజ్రీవాల్ మాట్లాడారు. ఈ20 పెట్రోల్కు వ్యతిరేకంగా చేపట్టబోయే ఉద్యమం గురించి వివరించారు. అమెరికాను సంతృప్తి పరచడం కోసమే యూఎస్-ఇండియా ట్రేడ్ డీల్కు మోదీ అంగీకరించారని విమర్శించారు.
‘‘ఈ20 పెట్రోల్కు వ్యతిరేకంగా ఆన్లైన్లో దాఖలు చేసిన పిటిషన్కు ఇప్పటికే రెండు లక్షల మందికి పైగా మద్దతు ఇచ్చారు. వాటికి సంబంధించిన డాక్యుమెంట్లను ప్రధాని మోదీ నివాసానికి తీసుకెళ్తా. ఆగష్టు 4, మంగళవారం మధ్యాహ్నం మోదీ నివాసానికి వెళ్లి, ఈ పిటిషన్లు సమర్పిస్తా. ప్రధాని నివాసం వరకు సాగే ఈ మార్చ్ కోసం ఎవరూ రానవసరం లేదు. లాఠీలకు భయపడని నాలాంటి 100 మందిని మాత్రమే ఈ మార్చ్కు తీసుకెళ్తా. ఈ20 పెట్రోల్ వినియోగం విషయంలో ప్రభుత్వం మూడు డిమాండ్లకు అంగీకరించాలి. మొదటిది.. స్వచ్ఛమైన పెట్రోల్ వాడాలో లేక ఈ20 పెట్రోల్ వాడాలో నిర్ణయించుకునే హక్కు వాహనదారులకు మాత్రమే ఉండాలి. బలవంతంగా ఒక్కదాన్ని మాత్రమే వాడేలా చేయకూడదు. రెండోది.. ఒకవేళ ఈ20 పెట్రోల్ను ప్రభుత్వం తప్పనిసరి చేయాలనుకుంటే అది సాధారణ పెట్రోల్ కంటే తక్కువ ధరలోనే అందుబాటులో ఉంచాలి. మూడోది.. అంతర్జాతీయంగా క్రూడాయిల్ ధరలు భారీగా తగ్గిన నేపథ్యంలో దేశంలో లీటర్ పెట్రోల్ను రూ.84 కంటే తక్కువ ధరకే అందించాలి’’ అని కేజ్రీవాల్ డిమాండ్ చేశారు.
ఇప్పటికే వాహనదారులు ఈ20 పెట్రోల్ బలవంతంగా వాడుతుండగా, వారికి ఎలాంటి ప్రయోజనం కలగడం లేదన్నారు. ‘‘ఈ20 పెట్రోల్ వాడటం వల్ల వాహనదారులకు ఏ ప్రయోజనం లేనప్పుడు దాని ఉపయోగం ఏంటి..? ఎందుకు దీన్ని వాడాలి..? పైగా ఇథనాల్ పెట్రోల్ వల్ల వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. పెట్రోల్ ధరలు తగ్గలేదు. పైగా మైలేజీ తగ్గుతోంది. వాహనాలు పాడవుతున్నాయి. రైతులకు ఎలాంటి ఉపయోగం లేదు. విదేశీ మారకద్రవ్యాన్ని కూడా మిగల్చడం లేదు. పైగా ఇథనాల్ ఉత్పత్తి వల్ల పర్యావరణం దెబ్బతింటుంది. ఇథనాల్ ఉత్పత్తి అయ్యే ప్రాంతంలో మొక్కలకు నష్టం. భూగర్భ జలాలు కాలుష్యమవుతాయి. అలాంటిది ఏవో అంకెలు చూపి ప్రజల్ని ప్రభుత్వం ఎందుకు తప్పుదోవపట్టిస్తోంది. దీన్ని బలవంతంగా ఎందుకు రుద్దుతున్నారు..? దీని వెనుక ఉన్న రహస్య ఎజెండా ఏంటి..? దీని గురించి తెలుసుకున్న తర్వాత అమెరికా ఒత్తిడి వల్లే ఇదంతా చేస్తున్నట్లు తెలుస్తోంది’’ అని కేజ్రీవాల్ వ్యాఖ్యానించారు.