India vs Westindies : వెస్టిండీస్ పర్యటన తొలి టెస్టులోనే దుమ్మురేపిన భారత జట్టు(Team India) ఆతిథ్య జట్టుకు గట్టి హెచ్చరికలు పంపింది. రెండో టెస్టులోనూ గెలిచి సిరీస్ సొంతం చేసుకోవాలని రోహిత్ శర్మ (Rohit Sharma) సేన పట్టుదలతో ఉంది. అయితే.. భారత్, వెస్టిండీస్ జట్లు తలపడనున్న రెండో టెస్టుకు ఓ ప్రత్యేకత ఉంది. ఇరుజట్లకు ఇది వందో టెస్టు మ్యాచ్. అవును.. ఇప్పటివరకు భారత్, విండీస్లు 99 టెస్టుల్లో ఎదురుపడ్డాయి.
జూలై 20న ట్రినిడాడ్లోని క్వీన్స్ పార్క్ ఓవల్(Queen’s Park Oval)లో రెండో టెస్టు టీమిండియా, విండీస్ ఆడబోయే వందో మ్యాచ్. దాంతో, ఈ మ్యాచ్పై అందరి కళ్లు నిలిచాయి. గత రికార్డులు పరిశీలిస్తే.. భారత్పై విండీస్ ఆధిపత్యం చెలాయిస్తూ వస్తోంది. వెస్టిండీస్ 30 టెస్టుల్లో విజయం సాధించగా భారత్ 23 మ్యాచుల్లో గెలిచింది. 46 టెస్టులు డ్రాగా ముగిశాయి.
డొమినికా(Dominica) వేదికగా జరిగిన మొదటి టెస్టులో భారత జట్టు అద్భుత విజయం సాధించింది. ఇన్నింగ్స్ 141 పరుగుల తేడాతో భారీ విక్టరీ కొట్టింది. యశస్వీ జైస్వాల్(171), రోహిత్ శర్మ(103) సెంచరీలతో చెలరేగగా.. సీనియర్ ఆఫ్ స్పిన్నర్ అశ్విన్(Ravichandran Ashwin) 12 వికెట్లతో విండీస్ను కోలుకోలేని దెబ్బతీశాడు. దాంతో టీమిండియా రెండు టెస్టుల సిరీస్లో 1-0 ఆధిక్యంలోకి వెళ్లింది.
అశ్విన్, యశస్వీ జైస్వాల్
అంతేకాదు ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ 2023-25 పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి చేరింది. అయితే.. 116 పాయింట్లతో రెండో స్థానంలో ఉన్న ఆస్ట్రేలియా(Australia) త్వరలోనే టీమిండియాను వెనక్కి నెట్టే అవకాశం ఉంది. ఒకవేళ భారత జట్టు 2-0తో సిరీస్ అందుకున్నా కూడా కంగారు జట్టు ముందుకెళ్లే వీలుంది. యాషెస్ సిరీస్లో ఆ జట్టు 3-2తో లేదా 4-1తో సిరీస్ గెలిస్తే మళ్లీ నంబర్ 1 అవుతుంది.