లక్నో: ఉత్తరప్రదేశ్ అయోధ్యలోని మెడికల్ కాలేజీలో బాంబు తయారీకి సంబంధించిన పత్రం బయటపడింది. ఈ సమాచారం తెలుసుకున్న పోలీసులు ఒక వైద్య విద్యార్థిని అదుపులోకి తీసుకున్నారు. ఈ సంఘటన ఆ మెడికల్ కాలేజీలో కలకలం రేపింది. (Ayodhya medical college) అయోధ్యలోని రాజర్షి దశరథ్ అటానమస్ స్టేట్ మెడికల్ కాలేజీలోని ఎక్స్-రే గదిలో బాంబు తయారీకి సంబంధించిన సూచనలు ఉన్న కాగితాన్ని ఆ విభాగపు ఇన్చార్జి శనివారం గుర్తించారు. చేతితో రాసిన ఆ కాగితంలో పేలుడు పదార్థం తయారీకి కావలసిన వివరాలు ఉన్నాయి. గేజ్ వైర్, అమ్మోనియం కార్బోనేట్, రెడ్ ఫాస్ఫరస్, రెడ్ సల్ఫైడ్, నైట్రిక్ యాసిడ్ వంటి వస్తువుల జాబితా కూడా ఉన్నది.
కాగా, చీఫ్ మెడికల్ సూపరింటెండెంట్ (సీఎంఎస్) డాక్టర్ అరవింద్ సింగ్ దీని గురించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో పోలీసులు అక్కడకు చేరుకుని ఆ కాగితాన్ని పరిశీలించారు. శుక్రవారం రాత్రి ఎక్స్-రే గదిలో విధుల్లో ఉన్న మొదటి సంవత్సరం వైద్య విద్యార్థి సర్ఫరాజ్ ఈ పత్రాన్ని రూపొందించినట్లు ప్రాథమిక విచారణలో తేలింది. ఉత్తరప్రదేశ్లోని బలరాంపూర్కు చెందిన అతడ్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సర్ఫరాజ్తో పాటు విధుల్లో ఉన్న మరో ఇద్దరిని కూడా విచారిస్తున్నారు. దీనిపై అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నట్లు పోలీస్ అధికారి తెలిపారు.
మరోవైపు ఈ సంఘటనతో మెడికల్ కాలేజీ యాజమాన్యం అప్రమత్తమైంది. కాలేజీ క్యాంపస్లో నిఘా పెంచాలని, ప్రాంగణంలోని భద్రతా ఏర్పాట్లపై సమీక్ష జరుపాలని సిబ్బందిని ఆదేశించింది. అలాగే 2025 నవంబర్లో ఢిల్లీలో జరిగిన పేలుడు ఘటనను ఇది గుర్తుకు తెచ్చింది. ఆ కేసులోని ముగ్గురు ప్రధాన నిందితులు ఫరీదాబాద్లోని అల్ ఫలా యూనివర్సిటీ ఉద్యోగులు కావడం గమనార్హం.