Asia Cup Records : ఈ ఏడాది ఆసియా కప్ హైబ్రిడ్ మోడల్(Hybrid Model)లో జరుగనున్న విషయం తెలిసిందే. ప్రతిష్టాత్మకమైన ఈ టోర్నమెంట్కు పాకిస్థాన్, శ్రీలంక ఆతిథ్యం ఇవ్వనున్నాయి. అయితే.. ఈ కప్లో ఇప్పటివరకూ టీమిండియా(Team India), లంక ఆధిపత్యం చెలాయిస్తూ వచ్చాయి. దాంతో, ఈసారి కూడా ప్రధానంగా పోటీ ఈ రెండు జట్ల మధ్యే ఉండనుందని విశ్లేషకుల భావన. ఈ నేపథ్యంలో ఆసియాకప్లో భారత్-శ్రీలంక హెడ్ టు హెడ్ రికార్డులపై ఓ లుక్కేద్దాం.
భారత్, శ్రీలంక క్రికెట్ జట్లను ఆసియా సింహాలుగా వ్యవహరించడంలో అతిశయోక్తి లేదు. ఈ టోర్నీలో ఈ రెండు జట్లు సాధించిన అపూర్వ విజయాలే అందుకు కారణం. ఈ ఖండాంతర చాంపియన్షిప్లో టీమిండియా, శ్రీలంక జట్లు హాట్ ఫేవరెట్లగా బరిలోకి దిగుతుంటాయి. 1984లో నిర్వహించిన ప్రారంభ ఎడిషన్లో భారత జట్టు చాంపియన్గా నిలిచింది. ఆ తర్వాత కూడా అదే దూకుడు కొనసాగించింది.
ఆసియాకప్ టైటిళ్లను భారత జట్టు అత్యధికంగా గెలుచుకోగా, శ్రీలంక ఆ తర్వాతి స్థానంలో ఉంది. ఇండియా 7 టైటిళ్లతో టాప్ ప్లేస్లో ఉంటే, శ్రీలంక 6 టైటిళ్లతో రెండో స్థానంలో ఉంది. ఇప్పటివరకూ ఆసియాకప్ టైటిల్ను అందుకున్న మరో దేశం పాకిస్థాన్ మాత్రమే. బంగ్లాదేశ్ ఒక్కసారి కూడా ట్రోఫీ సాధించలేకపోయింది. ఇండియా మూడుసార్లు, శ్రీలంక ఆరుసార్లు రన్నరప్గా నిలిచాయి. వచ్చే నెలలో ఆసియాకప్కు రంగం సిద్దమైంది.
ఆసియా కప్ ట్రోఫీతో భారత జట్టు
ఆసియాకప్ వన్డే ఫార్మాట్లో భారత్, శ్రీలంక ఇప్పటి వరకు 19 సార్లు తలపడ్డాయి. శ్రీలంక 10, భారత్ 9సార్లు విజయం అందుకున్నాయి. భారత జట్టు గెలుపుశాతం 47.36 శాతం కాగా, శ్రీలంక విజయాల శాతం 52.64 శాతంగా ఉంది. 2016లో టీ20 ఫార్మాట్ ప్రవేశపెట్టాక ఇరు జట్లు చెరో విజయం సాధించాయి. 8 ఏప్రిల్ 1984లో జరిగిన ఆరంభ టోర్నీలో శ్రీలంక 41 ఓవర్లలో 96 పరుగులకు ఆలౌటయింది. రంజన్ మదుగలే 38 పరుగులతో టాప్ స్కోరర్గా నిలిచాడు. ఈ మ్యాచ్లో మదన్లాల్ 11 పరుగులిచ్చి 3 వికెట్లు తీసుకున్నాడు. లక్ష్య ఛేదనలో భారత్ 21.4 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 97 పరుగులు చేసి విజయాన్ని అందుకుంది. సురీందర్ ఖన్నా 51 (నాటౌట్)తో టాప్ స్కోరర్గా నిలిచాడు.
1986లో భారత్-శ్రీలంక జట్ల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు దెబ్బతిన్నాయి. దాంతో ఆ ఏడాది శ్రీలంక ఆతిథ్యమిచ్చిన ఆసియాకప్ను భారత్ బాయ్కాట్ చేసింది. ఈ టోర్నీలో చివరిసారి ఇరుజట్లు నిరుడు సెప్టెంబరు 6న తలపడ్డాయి. తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 173 పరుగులు చేసింది.
రోహిత్శర్మ (72)
రోహిత్శర్మ 72 పరుగులు చేయగా, శ్రీలంక బౌలర్ దిల్షాన్ మదుశంక 24 పరుగులిచ్చి 3 వికెట్లు తీసుకున్నాడు. 174 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన శ్రీలంక మరో బంతి మిగిలి ఉండగానే 4 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. కుశాల్ మెండిస్ అర్ధ సెంచరీ (57) చేయగా, భారత బౌలర్ యుజ్వేంద్ర చాహల్ 34 పరుగులిచ్చి, మూడు వికెట్లు పడగొట్టాడు.