Harbhajan Singh : భారత జట్టుకు మూడు ఫార్మాట్లలో ముగ్గురు కెప్టెన్లు ఉండాలనే డిమాండ్ తెలిసిందే. టీ20లకు ఆదరణ పెరుగుతున్న ఈ కాలంలో ఇండియాకు రెండో కోచ్ ఉండాలని మాజీ స్పిన్నర్ హర్భజన్ సింగ్ అంటున్నాడు. మూడు ఫార్మట్లలో ఇద్దరు కెప్టెన్లు ఉన్నప్పడు ఇద్దరు కోచ్లు ఉంటే తప్పేంటి? అనేది అతని వాదన. అందుకని టీ20లకు ప్రత్యేక కోచ్ ఉండాలని హర్భజన్ అభిప్రాయపడ్డాడు. ‘ఇద్దరు కెప్టెన్లు ఉన్నారు. అలాంటప్పుడు ఇద్దరు కోచ్లు ఉండాలి. టీ20 క్రికెట్లో అనుభవంతో పాటు ఆ ఫార్మాట్ను బాగా అర్థం చేసుకున్న వ్యక్తిని కోచ్గా నియమించాలి’ అని భజ్జీ తెలిపాడు.
అంతేకాదు టీ20 కోచ్గా ఇద్దరు భారత మాజీ క్రికెటర్ల పేర్లు కూడా సూచించాడు. ఐపీఎల్ టీమ్ గుజరాత్ టైటన్స్ కోచ్గా ఉన్న అశీష్ నెహ్రా, మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్లలో ఒకరిని పొట్టి ఫార్మాట్ కోచ్గా ఎంపిక చేయాలని ఈ దిగ్గజ ఆఫ్ స్పిన్నర్ వెల్లడించాడు.
మాజీ ఫాస్ట్ బౌలర్ అశిష్ నెహ్రాకు టీ20 క్రికెట్ మీద మంచి అవగాహన ఉంది. అతని కోచింగ్లో గుజరాత్ టైటన్స్ పోయిన సీజన్లో ఐపీఎల్ ఛాంపియన్గా అవతరించింది. ప్రశాంతంగా ఉండే అతను వ్యూహాలు పన్నడంలో దిట్ట అని, అతను కోచ్గా ఉండడం తమకు కలిసొచ్చిందని ఆ జట్టు కెప్టెన్ హార్దిక్ పాండ్యా చెప్పాడు కూడా. ఇక.. వీరేంద్ర సెహ్వాగ్ గురించి చెప్పక్లర్లేదు. క్రీజులో అడుగుపెట్టిందే ఆలస్యం వీరబాదుడు బాదేస్తాడు. తన దూకుడైన ఆటతో వీరూ మూడు ఫార్మాట్లలో విధ్వంసక ఓపెనర్గా గుర్తింపు తెచ్చుకున్నాడు. అందుకని భజ్జీ పొట్టి క్రికెట్ జట్టు కోచ్లుగా ఈ ఇద్దరి పేర్లు సూచించాడు.
ప్రస్తుతం టీమిండియా వన్డే, టెస్టు కెప్టెన్గా రోహిత్ శర్మ కొనసాగుతున్నాడు. టీ20 కెప్టెన్సీని హార్దిక్ పాండ్యాకు అప్పగించారు. పొట్టి క్రికెట్ సారథిగా పాండ్యా ఇప్పటికే నిరూపించుకున్నాడు. అయితే.. చాలాకాలంగా భారత జట్టుకు ప్రధాన కోచ్ ఒక్కరే ఉంటున్నారు. వాళ్లే మూడు ఫార్మాట్లలో సేవలందిస్తున్నారు. ప్రస్తుతం మాజీ క్రికెటర్ రాహుల్ ద్రవిడ్ హెడ్ కోచ్గా ఉన్నాడు. అయితే.. భజ్జీ వ్యాఖ్యలపై బీసీసీఐ ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి. అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు పలికిన తర్వాత హర్భజన్ ఐపీఎల్లో ఆడాడు. ముంబై ఇండియన్స్, కోల్కతా నైట్ రైడర్స్ ఫ్రాంఛైజీలకు ప్రాతినిధ్యం వహించాడు.