Ishant Sharma : భారత జట్టు మాజీ ఫాస్ట్ బౌలర్ ఇషాంత్ శర్మ తన కెరీర్లో ఎదురైన మర్చిపోలేని సంఘటనను తాజాగా వెల్లడించాడు. క్రిక్బజ్ ‘రైజ్ ఆఫ్ న్యూ ఇండియా’ షోలో మాట్లాడిన అతను 2013 మొహాలీ వన్డేలో తన కెరీర్లోనే బాధాకరమైన క్షణం అని అన్నాడు. ‘ఆ మ్యాచ్లో జట్టు ఓటమికి నేనే కారణం. దాంతో, ఆ ఓటమి నన్ను నెలల తరబడి బాధించింది. అప్పుడు నాకు కాబోయే భార్య (ప్రతిమా సింగ్)కు ఫోన్ చేసి ఏడ్చాను. అలా నెలంతా ఆమెకు ప్రతిరోజు ఫోన్ చేసి ఏడ్చాను’ అని ఇషాంత్ వెల్లడించాడు.
‘ఎందుకనో తెలియదు నాకు ఆ మ్యాచ్ను మరచిపోవడం చాలా కష్టంగా అనిపించింది. అలాగని ఎక్కువ పరుగులు ఇచ్చినందుకు కాదు. నా కారణంగా జట్టు ఓడిపోయింది. అప్పుడు నేను డేటింగ్లో ఉన్నా. దాంతో, ఆమెకు ఫోన్ చేసి రోజూ ఏడ్చేవాడిని’ అని ఇషాంత్ చెప్పుకొచ్చాడు.
ఆ కష్ట సమయంలో కెప్టెన్ ధోనీ, శిఖర్ ధావన్ తనకు మద్దతుగా నిలిచారని ఇషాంత్ అన్నాడు. ధోనీ, ధావన్ నా రూమ్కు వచ్చి.. ‘నువ్వు బాగా ఆడుతున్నావు. ఒక్క మ్యాచ్ వల్ల నువ్వు వైట్ బాల్ బౌలర్గా పనికిరానని అనుకోవద్దు’ అని ధైర్యం చెప్పారని ఇషాంత్ తెలిపాడు.
మొహాలీ వన్డేలో జార్జ్ బెయిలీ కెప్టెన్సీలోని ఆసీస్ విజయం సాధించింది. అది కూడా అతి కష్టమైన పరిస్థితుల్లో. ఆ జట్టు గెలుపు కోసం ఓవర్లలో 44 రన్స్ కావాలి. చేతిలో నాలుగు వికెట్లు ఉన్నాయంతే. అయితే.. ఇషాంత్ ఓవర్లో ఆ జట్టు ఆల్రౌండర్ జేమ్స్ ఫాల్క్నర్ ఏకంగా 30 రన్స్ కొట్టాడు. అందులో ఒక ఫోర్, నాలుగు సిక్స్లు ఉన్నాయి. ఫాల్క్నర్ ధాటికి మరో మూడు బంతులు ఉండగానే ఆస్ట్రేలియా గెలిచింది. దాంతో, ఆ సిరీస్లో తర్వాతి మ్యాచ్లను ఇషాంత్ బెంచ్కే పరిమితం అయ్యాడు. అయితే.. టెస్టుల్లో విజయవంతమైన బౌలర్గా పేరు తెచ్చుకున్న ఇషాంత్ వంద టెస్టు మ్యాచ్లు ఆడాడు. అతను 2016లో తన చివరి వన్డే ఆడాడు.