Ravichandran Ashwin : బోర్డర్ – గవాస్కర్ ట్రోఫీలో జోరు కొనసాగించిన భారత జట్టు రెండు టెస్టులు నెగ్గింది. అయితే.. మూడు రోజుల్లోనే టెస్టు మ్యాచ్ ముగియడంపై అభిమానులు కొందరు నిరాశ చెందారు. ఇదే విషమమై తనకు విమానంలో ఎదురైన అనుభవాన్ని భారత జట్టు సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ యూట్యూబ్ ఛానెల్లో పంచుకున్నాడు. విమానంలో ఒక ప్రయాణికుడు.. ‘మీరు ఎందుకు మూడు రోజుల్లోనే మ్యాచ్ ముగించారు? నాకు అదేం నచ్చలేదు’ అని అశ్విన్తో అన్నాడట. అందుకు ఈ స్పిన్నర్.. ‘సార్.. టెస్టు క్రికెట్లో రెండు విషయాల్లో పూర్తిగా మార్పు వచ్చింది. మొదటిది ఏంటంటే.. ఆటగాళ్ల ఆలోచనా విధానం మునపటిలా లేదు. బ్యాటర్లు అందరూ దూకుడగా ఆడాలని, వేగంగా రన్స్ చేయాలని అనుకుంటున్నారు.
పరుగులు చేసేందుకు ఎక్కువ సమయం తీసుకునేందుకు వాళ్లు ఇష్టపడడం లేదు. ఆ ఒక్క కారణంతో వాళ్లను ఆటగాళ్లలో ఎవరు గొప్ప? అని నిర్ధారణకు రావడం, ఒకరితో మరొకరిని పోల్చడం సరికాదు. ఇక రెండో విషయం.. రెండు టెస్టులు మూడు రోజుల్లోనూ ముగియలేదు’ అని అశ్విన్ తెలిపాడు.
స్వదేశంలో దక్షిణాఫ్రికాను క్లీన్స్వీప్ చేసి భారత పర్యటనకు వచ్చిన ఆస్ట్రేలియాకు గర్వ భంగం జరిగింది. మొదటి టెస్టులో ఇండియా ఇన్నింగ్స్ 132 పరుగుల తేడాతో ఆసీస్ను చిత్తు చేసింది. ఢిల్లీ వేదికగా జరిగిన రెండో టెస్టులోనూ భారత స్పిన్నర్ల ధాటికి ఆసీస్ బ్యాటర్లు చేతులెత్తేశారు. ఈ మ్యాచ్లోనూ 6 వికెట్ల తేడాతో గెలుపొందింది. రెండు మ్యాచుల్లోనూ అశ్విన్ బ్యాటుతో, బంతితో రాణించాడు. మొదటి టెస్టులో నైట్వాచ్మెన్గా వచ్చిన అతను 23 రన్స్ చేశాడు. రెండో టెస్టులో అక్షర్పటేల్తో కలిసి సెంచరీ భాగస్వామ్యం నెలకొల్పాడు. దాంతో, ఇండియా అవలీలగా విజయం సాధించింది.
బోర్డర్ – గవాస్కర్ ట్రోఫీ నాలుగు టెస్టుల సిరీస్లో ఇండియా 2-0 ఆధిక్యంలో ఉంది. మార్చి 1న ఇండోర్లో మూడో టెస్టు జరగనుంది. ఈ టెస్టులోనూ విజయం సాధిస్తే టీమిండియా ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్ బెర్తు ఖరారు చేసుకుంటుంది. ఇప్పటికే ఫైనల్ చేరిన ఆస్ట్రేలియాతో టైటిల్ పోరులో అమీతుమీ తేల్చుకోనుంది. ఇంగ్లండ్లోని ఓవల్ స్టేడియంలో జూన్లో డబ్ల్యూటీసీ ఫైనల్ జరగనుంది.