Best Fielder Medal : వన్డే వరల్డ్ కప్ను మూడోసారి ముద్దాడేందుకు భారత జట్టు(Team India) మరో రెండు అడుగుల దూరంలో ఉంది. మెగా టోర్నీలో అజేయంగా సెమీస్ పోరుకు సిద్ధమవుతోంది. చివరి లీగ్ మ్యాచ్లో నెదర్లాండ్స్ను చిత్తుగా ఓడించిన రోహిత్ సేన ముంబైలో న్యూజిలాండ్ సవాల్కు కాచుకొని ఉంది. బెంగళూరులో డచ్ జట్టుపై విజయం అనంతరం భారత జట్టు డ్రెస్సింగ్ రూమ్లో బెస్ట్ ఫీల్డర్ అవార్డు(Best Fielder Medal) ఈవెంట్ జరిగింది. ఈసారి సూర్యకుమార్ యాదవ్(surya kumar yadav) అవార్డుకు ఎంపికయ్యాడు. అయితే.. ఈసారి విజేత పేరును ప్రకటించడాన్ని కొంచెం డిఫరెంట్గా ప్లాన్ చేశారు.
ఈసారి ఫీల్డింగ్ కోచ్ దిలీప్ ఏం చేశారంటే..? ఆటగాళ్లందరినీ గ్రౌండ్లోకి పిలిచారు. ఆ తర్వాత బెస్ట్ ఫీల్డర్ మెడల్ రేసులో ఉన్న ముగ్గురి ఫొటోల్ని బిగ్స్క్రీన్పై చూపించారు. దానిపై వరుసగా పాటు రవీంద్ర జడేజా, సూర్యకుమార్ యాదవ్, కేఎల్ రాహుల్ ఫొటోలు వచ్చాయి.
ఆ వెంటనే ‘డెసిషన్ పెండింగ్’ అనే అక్షరాలు ప్రత్యక్షమయ్యాయి.. దాంతో, విజేత ఎవరు? అని జట్టు సభ్యులంతా ఆసక్తిగా చూస్తుండగా.. గ్రౌండ్ సిబ్బంది ఇంగ్లీష్లో విడివిడిగా S, U, R, Y, A (సూర్య) రాసున్న పెద్ద అట్టముక్కలను ప్రదర్శించారు. దాంతో, అందరూ సూర్యను చప్పట్లతో అభినందించారు. భారత జట్టు త్రోడౌన్ స్పెషలిస్ట్ నువాన్ సెనెవిరత్నే సూర్యకు మెడల్ బహూకరించాడు.
శ్రేయస్ అయ్యర్(128 నాటౌట్), రాహుల్(102)
మెగా టోర్నీలో ఇంగ్లండ్, ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా, న్యూజిలండ్ వంటి పెద్ద జట్లను చిత్తు చేసిన భారత్.. ఆదివారం బెంగళూరులో నెదర్లాండ్స్ను వణికించింది. మొదట టాపార్డర్లో ముగ్గరు అర్థ శతకాలతో రాణించగా.. శ్రేయస్ అయ్యర్(128 నాటౌట్), కేఎల్ రాహుల్(102) శతకమోతతో చిన్నస్వామి స్టేడియం దద్దరిల్లింది. పేస్ త్రయం సిరాజ్, షమీ, బుమ్రా నిప్పులు చెరగడంతో డచ్ జట్టు 250 పరుగులకే ఆలౌటయ్యింది. దాంతో వరుసగా 9వ విజయం టీమిండియా ఖాతాలో చేరింది.