న్యూఢిల్లీ : గత ఏడాది నవంబర్లో లాంఛ్ అయినప్పటి నుంచి చాట్జీపీటీ (ChatGPT) టెక్ ప్రపంచంలో హాట్ డిబేట్గా మారింది. చాట్జీపీటీ ఆవిష్కరణతో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పట్ల టెకీలు విపరీతమైన ఆసక్తి కనబరుస్తున్నారు. బడా కంపెనీల నుంచి టెక్ దిగ్గజాలు, ఏఐ స్టార్టప్ల వరకూ కృత్రిమ మేథపై పెద్దఎత్తున పెట్టుబడులు పెడుతున్నారు. ఇక చాట్జీపీటీపై చేపట్టిన తాజా పరిశోధన కీలక వివరాలు వెల్లడించింది. చాట్జీపీటీ మానవ ఉద్వేగాలను అర్ధం చేసుకుంటుందని పరిశోధకులు వెల్లడించారు.
మైక్రోసాఫ్ట్, విలియం అండ్ మేరీ, ఆసియాలోని పరిశోధనా కేంద్రాలు సంయుక్తంగా చేపట్టిన అధ్యయనంలో కీలక వివరాలు బహిర్గతమయ్యాయి. ఈ అధ్యయనంలో లార్జ్ ల్యాంగ్వేజ్ మోడల్స్ (ఎల్ఎల్ఎం) మానవ ఉద్వేగాలను అర్ధం చేసుకోగలవని తేలింది. చాట్జీపీటీ వంటి ఏఐ టూల్స్కు మూలమైన ఎల్ఎల్ఎంలు మానవ ఉద్వేగాలను అర్ధం చేసుకుని, అందుకు అనుగుణంగా స్పందిస్తాయని ఈ అధ్యయనం తెలిపింది.
ఈ ఆవిష్కరణతో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కాస్తా ఆర్టిఫిషియల్ జనరల్ ఇంటెలిజెన్స్(ఏజీఐ) దిశగా అడుగులు వేస్తోందని టెక్ నిపుణులు చెబుతున్నారు. మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల సైతం ఈ ఏడాది జూన్లో వైర్డ్ ఇంటర్వ్యూలో ఏజీఐపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ ప్రపంచంలోని 800 కోట్ల మందిలో ప్రతి ఒక్కరూ ఓ ఏఐ ట్యూటర్, ఏఐ డాక్టర్, ప్రోగ్రామర్, కన్సల్టెంట్ను కలిగిఉండాలన్నది తన కల అని పేర్కొన్నారు. ఏఐ ప్రయోజనాలపై తాను ప్రముఖంగా దృష్టి సారిస్తానని చెప్పుకొచ్చారు.
Read More :