Suresh Raina : భారత మాజీ ఆల్రౌండర్ సురేశ్ రైనా(Suresh Raina) మళ్లీ పసుపు రంగు జెర్సీలో కనిపించబోతున్నాడు. మాజీ ఆల్రౌండర్ యువరాజ్ సింగ్(Yuvraj Singh)తో కలిసి టీమిండియాకు ఎన్నో చిరస్మరణీయ విజయాలు అందించిన రైనా.. అనంతరం ఇండియన్ ప్రీమియర్ లీగ్(IPL)లో చెన్నై సూపర్ కింగ్స్ ప్రధాన ఆటగాడిగా చితక్కొట్టాడు.
కొన్నాళ్లుగా ఆటకు దూరమైన ఈ లెఫ్ట్ హ్యాండర్ ఇండియన్ వెటరన్ ప్రీమియర్ లీగ్(Indian Veteran Premier League) ఆరంభ సీజన్లో అభిమానులను అలరించనున్నాడు. ఈ డాషింగ్ బ్యారట్ సొంత రాష్ట్రం ఉత్తరప్రదేశ్ సారథిగా బరిలోకి దిగనున్నాడు. ఈ విషయాన్ని రైనా సోషల్ మీడియా వేదికగా వెల్లడించాడు.
‘అందరికి హాయ్. నేను సురేశ్ రైనా. ఇండియన్ వెటరన్ ప్రీమియర్ లీగ్లో భాగం అవుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది. నేను ఉత్తరప్రదేశ్ టీమ్ తరఫున ఆడుతున్నా. ఈ లీగ్తో వెటరన్ క్రికెటర్లతో మళ్లీ మమేకం అయ్యే చాన్స్ దొరికింది’ అంటూ రైనా తన పోస్ట్లో రాసుకొచ్చాడు.
Legends collide in the Indian Veteran Premier League (IVPL) as cricket icons like Chris Gayle, Virender Sehwag, Suresh Raina, Herschel Gibbs, Yusuf Pathan and many more grace the pitch! pic.twitter.com/VauDT4qyFE
— Indian Veteran Premier League (@ivplt20) February 11, 2024
ఐవీపీఎల్ ఫిబ్రవరి 23 నుంచి మార్చి 3 వరకు జరుగనుంది. ఈ మెగా టోర్నీలో మొత్తం ఆరు జట్లు పాల్గొననున్నాయి. వీవీఐపీ ఉత్తరప్రదేశ్, రాజస్థాన్ లెజెండ్స్, రెడ్ కార్పెట్ ఢిల్లీ, ఛత్తీస్గఢ్ వారియర్స్, తెలంగాణ టైగర్స్, ముంబై చాంపియన్స్ జట్లు టైటిల్ కోసం హోరీహోరీగా తలపడనున్నాయి.
భారత జట్టు మాజీ ఆటగాళ్లు వీరేంద్ర సెహ్వాగ్, మునాఫ్ పటేల్, రజత్ భాటియా, ప్రవీణ్ కుమార్, యుసుఫ్ పఠాన్లు పాల్గొననున్నారు. వీళ్లతో పాటు వెస్టిండీస్ మాజీ విధ్వంసక ఓపెనర్ క్రిస్ గేల్, దక్షిణాఫ్రికా మాజీ ఓపెనర్ హెర్షలీ గిబ్స్లు కూడా తమ కళాత్మక షాట్లతో ఫ్యాన్స్ను అలరించేందుకు సిద్ధమవుతున్నారు.