హైదరాబాద్: కేసీఆర్పై మంత్రి కోమటిరెడ్డి వ్యాఖ్యలపై హరీశ్ రావు (Harish Rao) ఆగ్రహం వ్యక్తంచేశారు. కేసీఆర్పై (KCR) వ్యాఖ్యలకు బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. నల్లగొండలో బీఆర్ఎస్ సభ పెట్టడంతోనే.. కేఆర్ఎంబీకి ప్రాజెక్టులను అప్పజెప్పడంపై కాంగ్రెస్ ప్రభుత్వం వెనక్కి తగ్గిందన్నారు. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సత్యదూరమైన ప్రజెంటేషన్ ఇచ్చారని విమర్శించారు. ఈ సందర్భంగా మంత్రి కోమటిరెడ్డి కలుగజేసుకుని మాట్లాడుతూ.. ఏపీ సీఎం జగన్ స్టేట్మెంట్ విన్నతర్వాత కేసీఆర్ తల ఎక్కడ పెట్టుకుంటారని ప్రశ్నించారు. ఎన్నికల్లో బీఆర్ఎస్కు నల్లగొండ ప్రజలు చెప్పుతో కొట్టినట్లు సమాధానమిచ్చారని చెప్పారు. దీంతో మంత్రి వ్యాఖ్యలపై హరీశ్ రావు అభ్యంతరం తెలిపారు.
పదేండ్లు సీఎంగా పనిచేసిన వ్యక్తిపై అలాంటి వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు. రాహుల్ గాంధీని చెప్పుతో కొడతామని తాము అనలేమా అని ప్రశ్నించారు. అమేథీలో రాహుల్ని కూడా ప్రజలు చెప్పుతో కొట్టినట్టేనా అని నిలదీశారు. కోమటిరెడ్డి వ్యాఖ్యలను రికార్డులను తొలగించాలని, బేషరతుగా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. సభాపతి ఏకపక్షంగా మంత్రి అవకాశం ఇవ్వడం తగదని విమర్శించారు. మంత్రి క్షమాపణలు చెబితేనే తాను మాట్లాడుతానని పట్టుబట్టారు. దీంతో స్పీకర్ ప్రసాద్ కుమార్ రికార్డుల నుంచి మంత్రి వ్యాఖ్యలను తొలగిస్తానని ప్రకటించడంతో హరీశ్ రావు తన ప్రసంగాన్ని కొనసాగించారు.