RJD MLAs: బీహార్ సీఎం నితీశ్ కుమార్ ఇవాళ అసెంబ్లీలో బలపరీక్షను ఎదుర్కోనున్నారు. అసెంబ్లీలో విశ్వాస తీర్మానం ప్రవేశపెట్టడం ద్వారా తన సర్కారుకు ఎమ్మెల్యేల మద్దతు కోరనున్నారు. ఈ నేపథ్యంలో బలపరీక్ష కోసం ఇప్పటికే బీహార్ అసెంబ్లీ సమావేశమైంది. ఈ సందర్భంగా ప్రతిపక్ష ఆర్జేడీకి చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలు ప్రభుత్వం వైపు కూర్చోవడం చర్చనీయాంశమైంది.
#WATCH | RJD MLAs Chetan Anand, Neelam Devi
and Prahlad Yadav sit on the government side in the Bihar Assembly in Patna.Floor Test of CM Nitish Kumar’s government to prove their majority will be held today. pic.twitter.com/JhIlNiaiNR
— ANI (@ANI) February 12, 2024
ఆర్జేడీ ఎమ్మెల్యేలు చేతన్ ఆనంద్, నీలమ్ దేవి, ప్రహ్లాద్ యాదవ్ ప్రభుత్వంవైపు కూర్చుని తమ పార్టీ అగ్ర నేత, మాజీ డిప్యూటీ సీఎం తేజస్వి యాదవ్కు షాకిచ్చారు. కాగా బీహార్ అసెంబ్లీలో మొత్తం 243 సీట్లకుగాను ఆర్జేడీ, కాంగ్రెస్ నేతృత్వంలోని మహా కూటమికి 110 మంది ఎమ్మెల్యేల బలం ఉంది. బీజేపీ, జేడీయూ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమికి 125 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు.
బీహార్లో ప్రభుత్వం ఏర్పాటుకు కావాల్సిన మ్యాజిక్ ఫిగర్ 122 మంది ఎమ్మెల్యేలు. ఎన్డీఏ కూటమిలోని నలుగురు ఐదుగురు ఎమ్మెల్యేలు తీర్మానికి వ్యతిరేకంగా ఓటు వేసినా నితీశ్ సర్కారు సభ విశ్వాసం కోల్పోతుందని ప్రతిపక్ష మహా కూటమి భావిస్తోంది. ఇలాంటి తరుణంలో ఆర్జేడీకి చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలు ప్రభుత్వం వైపు వెళ్లడంతో ప్రతిపక్ష కూటమి ఆశలు ఆవిరయ్యాయి.
కాగా, 2020 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ, జేడీయూ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి విజయం సాధించింది. నితీశ్ పార్టీ జేడీయూకు 43 స్థానాలే వచ్చినా.. 74 స్థానాల్లో గెలిచిన బీజేపీ నితీశ్ను సీఎంను చేసింది. అయితే తర్వాత బీజేపీతో విభేదించిన నితీశ్.. ఆర్జేడీ (75), కాంగ్రెస్ (19) నేతృత్వంలోని మహాకూటమిలో చేరి కొత్త సర్కారును ఏర్పాటు చేశారు. తాజాగా మహాకూటమికి టాటా చెప్పి మళ్లీ ఎన్డీఏ సర్కారును ఏర్పాటు చేశారు. ఇవాళ అసెంబ్లీలో బలనిరూపణకు సిద్ధమయ్యారు.