Stunted Growth | న్యూఢిల్లీ, ఏప్రిల్ 27: భారత్లోని కొండ ప్రాంతాల్లో జీవిస్తున్న చిన్నారుల్లో ఎదుగుదల లోపం ఉంటున్నట్టు ఒక అధ్యయనంలో వెల్లడైంది. నివసిస్తున్న ప్రాంతం ఎత్తు ఎంత ఎక్కువైతే వీరిలో ఈ ముప్పు అంతే ఎక్కువ ఉంటున్నట్టు తేలింది. ఐదేండ్ల లోపు వయసున్న 1.65 లక్షల మంది బాలల డాటాపై పరిశోధకులు అధ్యయనం చేశారు. ఇందులో 2015 – 16 జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే డాటా కూడా ఉంది. ఈ వివరాలు బ్రిటిష్ మెడికల్ జర్నల్ న్యూట్రిషన్, ప్రివెన్షన్ అండ్ హెల్త్లో ప్రచురితమయ్యాయి. కొండ ప్రాంతాల్లో నివసిస్తున్న ఐదేండ్ల లోపు పిల్లల్లో ఎదుగుల లోపం 36 శాతం అధికంగా ఉన్నట్టు పరిశోధకులు గుర్తించారు.
ఏడాదిన్నర లోపు వయసున్న వారిలో ఈ ముప్పు 27 శాతం, ఏడాదిన్నర నుంచి ఐదేండ్ల వయసున్న పిల్లల్లో 41 శాతం ఉన్నట్టు తేల్చారు. సముద్ర మట్టానికి వెయ్యి అడుగుల ఎత్తు లోపల నివసిస్తున్న వారితో పోలిస్తే 2 వేల అడుగులు, అంతకంటే ఎక్కువ ఎత్తులో నివసిస్తున్న వారిలో 40 శాతం ముప్పు ఎక్కువ ఉంటున్నట్టు గుర్తించారు. ఎత్తైన ప్రాంతాల్లో నివసించడం వల్ల ఆకలి తక్కువగా ఉండటం, ఆక్సిజన్, పోషకాల శోషణ తక్కువగా ఉండటం, సరైన ఆహారం లభించకపోవడం వంటి కారణాల వల్ల ఈ పరిస్థితి ఉంటుందని పరిశోధకులు చెప్తున్నారు.