న్యూఢిల్లీ : పంజాబ్ నేషనల్ బ్యాంకు కుంభకోణం కేసులో పారిపోయిన వజ్రాల వ్యాపారి మెహుల్ చోక్సీ బెయిల్ విచారణను డొమినికా హైకోర్టు ఈ నెల 11వ తేదీకి వాయిదా వేసినట్లు స్థానిక మీడియా తెలిపింది. అక్రమంగా డొమినికాలోకి ప్రవేశించారన్న ఆరోపణలపై పోలీసులు అరెస్టు చేశారు. స్థానిక మెజిస్ట్రేట్ కోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేయగా.. ఆరోపణల తీవ్రత దృష్ట్యా పిటిషన్ను తిరస్కరించడంతో హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. చోక్సీ న్యాయవాదుల బృందం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హైకోర్టు న్యాయమూర్తుల ఎదుట వాదనలు వినిపించారు. ప్రభుత్వం తరఫున న్యాయవాది బెయిల్ ఇవ్వొద్దని వాదించారు.
ఈ మేరకు కోర్టు విచారణను 11వ తేదీకి వాయిదా వేసింది. చోక్సీ బృందం దాఖలు చేసిన హేబియస్ కార్పస్ పిటిషన్పై సైతం విచారణ వాయిదా పడింది. పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్బీ) కుంభకోణంలో నిందితుడైన మెహుల్ చోక్సీ 2018లో అంటిగ్వా పారిపోయాడు. గత నెల మే 23న అదృశ్యమైన చోక్సీ.. డొమినికా ద్వీపంలో అనుమానాస్పదంగా కనిపించగా.. పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే, అంటిగ్వాలోని జాలీ హార్బర్ నుంచి తనను కిడ్నాప్ చేసి పడవలో డొమినికాకు తీసుకువచ్చారని అతని న్యాయవాదులు ఆరోపించారు. హేబియస్ కార్పస్ పిటిషన్ వాదలు విన్న హైకోర్టు న్యాయమూర్తి ఆదేశాల మేరకు చోక్సీని రోజౌ మేజిస్ట్రేట్ ముందు ప్రవేశ పెట్టగా బెయిల్ నిరాకరించారు.