అహ్మదాబాద్: ప్రతిష్టాత్మక టీ20 ప్రపంచకప్లో భారత్ మరో కీలక పోరుకు సిద్ధమైంది. ఆదివారం మొతెరా స్టేడియం వేదికగా టీమ్ఇండియా, దక్షిణాఫ్రికా మధ్య సూపర్-8 మ్యాచ్ జరుగనుంది. గ్రూపు దశలో ఓటమి ఎరుగని ఇరు జట్లు అమీతుమీ తేల్చుకునేందుకు సై అంటున్నాయి. మెగాటోర్నీలో టైటిల్ ఫెవరేట్లలో ముందంజలో ఉన్న భారత్, దక్షిణాఫ్రికా సమవుజ్జీలుగా బరిలోకి దిగుతున్నాయి. గత ఎడిషన్లో ఫైనల్లో తమకు ఎదురైన ఓటమికి దీటైన ప్రతీకారం కోసం సఫారీలు కసిమీదుంటే పొట్టి ఫార్మాట్లో టీమ్ఇండియా ఎదురన్నదే లేకుండా దూసుకెళుతున్నది.
దీనికి తోడు కొట్టిన పిండిలాంటి సొంత ఇలాఖాలో జరుగుతున్న మెగాటోర్నీలో కచ్చితంగా కప్ కొట్టాలన్న పట్టుదలతో ఉన్న సూర్యకుమార్యాదవ్ నేతృత్వంలోని భారత్ అందుకు తగ్గట్లు పావులు కదుపుతున్నది. అమెరికాతో తొలి మ్యాచ్ నుంచి మొదలుపెడితే నమీబియా, పాకిస్థాన్, నెదర్లాండ్స్తో ప్రతీ మ్యాచ్లో మనోళ్లు సమష్టి ప్రదర్శన కనబరిచారు. టాపార్డర్ నిలకడలేమి ప్రదర్శిస్తున్నా మిడిలార్డర్, లోయార్డర్ బ్యాటింగ్తో పోరాడే స్కోర్లు సాధ్యమవుతున్నాయి. బుమ్రా, అర్ష్దీప్సింగ్, హార్దిక్ పేస్ దళాన్ని ముందుకు నడిపిస్తుంటే..వరుణ్ చక్రవర్తి, అక్షర్పటేల్, కుల్దీప్యాదవ్ పరిస్థితులకు తగ్గట్లు ప్రత్యర్థులకు చెక్ పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. మరోవైపు సమతూకంగా కనిపిస్తున్న దక్షిణాఫ్రికాను కూడా తక్కువ అంచనా వేసేందుకు భారత్ ప్రయత్నించకపోవచ్చు.
గ్రూపు దశలో సఫారీలు అహ్మదాబాద్లోనే మూడు మ్యాచ్లు ఆడటం వారికి కలిసొచ్చే అంశం కానుంది. బ్యాటింగ్లో కెప్టెన్ మార్క్మ్,్ర డికాక్, రికల్టన్, బ్రెవిస్, మిల్లర్లో ఏ ఒక్కరు కుదురుకున్నా..టీమ్ఇండియా బౌలర్లకు అగ్నిపరీక్షే అవుతుంది. బౌలింగ్లో రబాడ, ఎంగ్డీ, మహారాజ్, బాశ్, యాన్సెన్ చెలరేగితే మన బ్యాటర్లకు ఇబ్బందులు తప్పకపోవచ్చు. పొట్టి ఫార్మాట్లో వరుసగా 12 విజయాలతో జోరుమీదున్న భారత్ను అడ్డుకోవాలంటే సఫారీలు శక్తికి మించి పోరాడాల్సిన పరిస్థితి. మొత్తంగా సూపర్-8లో మూడింటికి మూడు మ్యాచ్లు గెలిచి సెమీస్ బెర్తు ఖరారు చేసుకోవాలని ఇరు జట్లు కృత నిశ్చయంతో ఉన్నాయి. ఈనేపథ్యంలో ఇరు జట్ల మధ్య సండే బ్లాక్బస్టర్ అభిమానులను అలరించడం ఖాయంగా కనిపిస్తున్నది.
మెగాటోర్నీలో టీమ్ఇండియా టాపార్డర్ బ్యాటింగ్ మేనేజ్మెంట్ను ఆందోళనకు గురిచేస్తున్నది. ప్రపంచకప్నకు ముందు సూపర్ ఫామ్తో విజృంభించిన అభిషేక్శర్మ హ్యాట్రిక్ డక్ ఔట్లతో ఘోరంగా నిరాశపరిచాడు. ఇన్నింగ్స్ తొలి ఓవర్లోనే పరుగుల ఖాతా తెరువకుండానే ప్రత్యర్థికి వికెట్ సమర్పించుకుంటున్నాడు. సఫారీలతో సూపర్-8 పోరులోనైనా ఖాతా తెరుస్తాడా అన్నది ఆసక్తికరంగా మారింది. భారీ అంచనాలు పెట్టుకున్న హైదరాబాదీ తిలక్వర్మ స్థాయికి తగ్గ ప్రదర్శన కనబర్చలేకపోతున్నాడు.
ఇప్పటి వరకు 120 స్ట్రైక్రేట్కు పరిమితమైన తిలక్ దూకుడుగా ఆడలేకపోతున్నాడు. కీలకమైన మూడో నంబర్లో వచ్చే తిలక్ భారీ షాట్లు ఆడటంలో విఫలమవుతున్నాడు. మరోవైపు ఇషాన్ కిషన్ 202 స్ట్రైక్రేట్తో ఆకాశమే హద్దుగా చెలరేగుతున్నాడు. మిడిలార్డర్లో శివమ్ దూబే టచ్లోకి రాగా, హార్దిక్పాండ్యా, రింకూసింగ్ బ్యాట్లు ఝులిపించాల్సి ఉంది.సుందర్ స్థానంలో అక్షర్పటేల్ రావడం ఖాయంగా కనిపిస్తుండగా, పిచ్ను దృష్టిలో పెట్టుకుని అర్ష్దీప్సింగ్ స్థానంలో కుల్దీప్యాదవ్ను తుది జట్టులోకి తీసుకునే చాన్స్ ఉంది. అంతకుమించి మార్పులేమి ఉండకపోవచ్చు.