న్యూఢిల్లీ : కేంద్ర మంత్రివర్గ విస్తరణతో ఒరిగేదేమీ లేదని, కేంద్ర ప్రభుత్వ పాలనలో సమూల మార్పులు రావాలని కాంగ్రెస్ వ్యాఖ్యానించింది. ఆర్థిక వ్యవస్థ, ఉపాధి, ఆరోగ్య మౌలిక, జాతీయ భద్రత వంటి రంగాల్లో బీజేపీ ప్రభుత్వం విఫలమైందని, ఈ నేపథ్యంలో మంత్రివర్గ విస్తరణ అర్ధరహితమని కాంగ్రెస్ నేత జైవీర్ షెర్గిల్ విమర్శించారు. బీజేపీ ప్రభుత్వం మంత్రుల శాఖల మార్పు, కొత్త మంత్రుల నియామకం కంటే దూరదృష్టి, సుపరిపాలనపై దృష్టిసారించడం మేలని హితవు పలికారు.
మే 2019లో మోదీ ప్రభుత్వం రెండవసారి పాలనా పగ్గాలు చేపట్టిన తర్వాత మంత్రివర్గాన్ని విస్తరించడం ఇదే తొలిసారి. బుధవారం సాయంత్రం ఆరు గంటలకు జరిగే కేంద్ర మంత్రివర్గ విస్తరణలో కొత్తగా 27 మందికి అవకాశం ఉంటుందని భావిస్తున్నారు. త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరిగే ఐదు రాష్ట్రాలకు విస్తరణలో అధిక ప్రాధాన్యత ఉంటుందని చెబుతున్నారు. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, మహిళలకు విస్తరణలో పెద్దపీట వేయనున్నారు.