SL vs AFG: స్వదేశంలో అఫ్గానిస్తాన్తో ముగిసిన ఏకైక టెస్టులో శ్రీలంక పది వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఆట మూడో రోజు అద్భుతంగా ఆడిన అఫ్గాన్.. నాలుగో రోజు మాత్రం స్పిన్నర్ ప్రభాత్ జయసూర్య (5/107) స్పిన్ మాయాజాలానికి చిత్తైంది. నిన్న సెంచరీ చేసిన ఇబ్రహీం జద్రాన్ (114)తో పాటు జయసూర్య లోయరార్డర్ పనిపట్టాడు. అతడికి తోడుగా కసున్ రజిత కూడా మూడు వికెట్లు తీయడంతో అఫ్గాన్ 296 పరుగులకు ఆలౌట్ అయి లంక ముందు 56 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. లక్ష్యాన్ని లంక 7.2 ఓవర్లలోనే ఛేదించింది.
కొలంబోలోని ప్రేమదాస స్టేడియం వేదికగా సోమవారం ముగిసిన ఏకైక టెస్టులో మూడో రోజు ఆట ముగిసే సమయానికి ఒక వికెట్ మాత్రమే కోల్పోయి 198 పరుగులు చేసింది. జద్రాన్తో పాటు రహ్మత్ షా (54)లు క్రీజులో ఉండటంతో అఫ్గాన్ భారీ స్కోరు సాధించడం పక్కా అని అఫ్గాన్లు భావించారు. కానీ జయసూర్య, రజితలు అఫ్గాన్లను కోలుకోనీయలేదు. రహ్మత్ షా ను రజిత ఔట్ చేయగా జద్రాన్, కెప్టెన్ హష్మతుల్లా షాహిది (18)లను జయసూర్య పెవిలియన్కు పంపాడు. ఆ తర్వాత వచ్చిన బ్యాటర్లలో నసీర్ జమల్ (41 నాటౌట్) ఒక్కడే క్రీజులో నిలబడ్డాడు. ఆరుగురు బ్యాటర్లు సింగిల్ డిజిట్కే పరిమితమయ్యారు.
🇱🇰 Sri Lanka DOMINATES Afghanistan in a resounding 10-wicket victory! #SLvAFG
A clinical performance from the Lions secures the one-off Test series in style! pic.twitter.com/FcmZbcvil7
— Sri Lanka Cricket 🇱🇰 (@OfficialSLC) February 5, 2024
స్వల్ప ఛేదనలో లంక దంచికొట్టింది. దిముత్ కరుణరత్నె (22 బంతుల్లో 32 నాటౌట్, 3 ఫోర్లు, 1 సిక్స్), నిషాన్ మధుష్క (23 బంతుల్లో 22, 4 ఫోర్లు) లు 44 బంతుల్లోనే లంకకు గెలుపునందించారు. తద్వారా లంక పది వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఇరు జట్ల మధ్య మూడు మ్యాచ్ల వన్డే సిరీస్ ఈ నెల 9 నుంచి పల్లెకెలె వేదికగా మొదలవనుంది. పల్లెకెలెలోనే మూడు మ్యాచ్లు జరుగుతాయి.