NTR | ఎన్టీఆర్, ప్రశాంత్నీల్ కాంబినేషన్ ప్రకటన వచ్చినప్పట్నుంచీ ఈ సినిమా అప్డేట్ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఓ వైపు ఎన్టీయార్ దేవర, వార్ 2 సినిమాలతో బిజీగా ఉంటే, మరోవైపు ప్రశాంత్నీల్ ‘సలార్2 – సౌర్యాంగపర్వం’ పనుల్లో తీరికలేకుండా ఉన్నారు. వీరు ప్రస్తుతం చేస్తున్న ప్రాజెక్టులు పూర్తయితేగానీ, వీరు కలిసి పనిచేసే పరిస్థితి లేదు. అయితే.. సోషల్మీడియాలో వీరి సినిమాపై ఓ వార్త ప్రస్తుతం హల్చల్ చేస్తున్నది.
‘ఎన్టీయార్ 31’ వర్కింగ్ టైటిల్తో మైత్రీ మూవీమేకర్స్ సంస్థ నిర్మిస్తున్న వీరి చిత్రానికి ‘డ్రాగన్’ అనే పేరును ఖరారు చేసినట్టు ఈ వార్త సారాంశం. ఈ పేరుతో కొన్ని పోస్టర్లు కూడా ఎక్స్లో దర్శనమిస్తున్నాయి. అక్టోబర్లో పట్టాలెక్కనున్న ఈ సినిమాను దర్శకుడు ప్రశాంత్నీల్ రెండు భాగాలుగా తెరకెక్కించనున్నారట.
త్వరలో దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన రానుందని తెలుస్తున్నది. ఇదిలావుంటే.. ఎన్టీయార్, కొరటాల శివల ‘దేవర’ అక్టోబర్ 10న విడుదల కానున్న విషయం తెలిసిందే. ప్రమోషన్లో భాగంగా ఈ సినిమా ఫస్ట్ సింగిల్ని ఈ నెల 19న విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఈ సందర్భంగా ఆ పాటకు సంబంధించిన ప్రోమోను శుక్రవారం విడుదల చేశారు.