Sikinder Raza : పొట్టి ప్రపంచ కప్ ముందు జింబాబ్బే క్రికెట్ బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. వచ్చే నెలలో వరల్డ్ కప్ క్వాలిఫయర్స్ నేపథ్యంలో టీ20 జట్టుకు కొత్త కెప్టెన్ను ప్రకటించింది. క్రెగ్ ఎర్విన్(Craig Ervine) స్థానంలో ఆల్రౌండర్ సికిందర్ రజా (Sikinder Raza)కు జట్టు పగ్గాలు అప్పగించింది. ఇకపై ఎర్విన్ టెస్టులు, వన్డేలకు మాత్రమే కెప్టెన్గా కొనసాగనున్నాడు. నవంబర్ 4వ తేదీన విక్టోరియా ఫాల్స్లో సమావేశమైన బోర్డు పెద్దలు సికిందర్ను పొట్టి ఫార్మాట్కు సారథిగా నియమిస్తూ కీలక నిర్ణయం తీసుకున్నారు.
సికిందర్ రజా సొంత దేశం ఏంటో తెలుసా..? పాకిస్థాన్. అవును.. అతడు పుట్టి పెరిగిందంతా అక్కడి సియల్కోట్(Sialkot) సిటీలో. సికిందర్ మొదట్లో యుద్ద విమానం పైలెట్ కావాలనుకున్నాడు. కానీ, అతి ముఖ్యమైన కంటి పరీక్షలో పాస్ కాలేకపోయాడు. దాంతో, కుమారుడి పై చదువుల కోసం అతడి తల్లిదండ్రులు 2002లో జింబాబ్వేకు వలస వెళ్లారు.
2007లో ఫస్ట్ క్లాస్ క్రికెట్లో ఆరంగేట్రం చేసిన రజా… 2011లో ఆ దేశ పౌరసత్వం సంపాదించాడు. 2013లో జింబాబ్బే తరఫున తొలి వన్డే ఆడిన అతడు అనతికాలంలోనే జట్టులో కీలక ఆటగాడిగా ఎదిగాడు. నిరుడు ఆస్ట్రేలియా ఆతిథ్యం ఇచ్చిన టీ20 వరల్డ్ కప్లో సికిందర్ సంచలన ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. అంతేకాదు ఇండియన్ ప్రీమియర్ లీగ్లోనూ ఈ స్పిన్ ఆల్రౌండర్ పంజాబ్ కింగ్స్(Punjab Kings) తరఫున సత్తా చాటాడు.
వెస్టిండీస్, అమెరికా 2024 టీ20 వరల్డ్ కప్ పోటీలకు సంయుక్తంగా ఆతిథ్యం ఇస్తున్న విషయం తెలిసిందే. 20 జట్లు పాల్గొనే ఈ టోర్నమెంట్కు ఇప్పటివరకూ 18 జట్లు అర్హత సాధించాయి. తర్వలో జరగబోయే ఆఫ్రికా క్వాలిఫయర్స్తో మిగిలిన రెండు బెర్తులు ఖరారు కానున్నాయి.