INDvsAFG T20I: రేపట్నుంచి స్వదేశంలో అఫ్గానిస్తాన్ వేదికగా జరగాల్సి ఉన్న మూడు మ్యాచ్ల టీ20 సిరీస్కు టీమిండియా వికెట్ కీపర్ బ్యాటర్ ఇషాన్ కిషన్తో పాటు మిడిలార్డర్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్కు సెలక్టర్లు అవకాశం కల్పించలేదు. అయితే ఇషాన్ కిషన్.. దక్షిణాఫ్రికా పర్యటన నుంచి అర్థాంతరంగా ఇంటికి వచ్చి ఆ తర్వాత ఇక్కడ బాలీవుడ్ బిగ్ బీ అమితాబ్ బచ్చన్ నిర్వహించే ‘కౌన్ బనేగా కరోడ్పతి’ షోలో పాల్గొన్నందుకు గాను అతడిపై బీసీసీఐ క్రమశిక్షణా చర్యల కింద అఫ్గాన్తో సిరీస్ నుంచి తప్పించిందని వార్తలు వెలుతుండగా తాజాగా అయ్యర్ కూడా అదే బాటలో ఉన్నాడని తెలుస్తోంది.
ఇషాన్ కిషన్.. బీసీసీఐ అనుమతి లేకుండా టీవీ షోలో పాల్గొన్నందుకు ప్రతిఫలం అనుభవిస్తున్నాడని, అందుకే అతడిని సెలక్టర్లు పక్కనబెట్టారని గత కొద్దిరోజులుగా గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇషాన్ కథ ఇలా ఉంటే శ్రేయస్ కూడా టీమ్ మేనేజ్మెంట్కు ఆగ్రహం తెప్పించే విధంగా వ్యవహరిస్తున్నాడని అందుకే అతడినీ అఫ్గాన్తో సిరీస్లో తప్పించినట్టు ప్రముఖ బెంగాలీ డైలీ ‘ఆనంద్బజార్ పత్రిక’ ఓ కథనంలో పేర్కొంది. అయితే సెలక్టర్లకు, బోర్డుకు కోపం తెప్పించేంత పని అయ్యర్ ఏం చేశాడన్నది మాత్రం స్పష్టత లేదు.
Shreyas Iyer and Ishan Kishan not selected in India’s squad for the T20I series against Afghanistan on disciplinary grounds. (Anandabazar Patrika) pic.twitter.com/fM5Qm6wfoZ
— CricketMAN2 (@ImTanujSingh) January 10, 2024
ఇటీవలే దక్షిణాఫ్రికా పర్యటన ముగించుకున్న అయ్యర్.. త్వరలోనే రంజీ మ్యాచ్లు ఆడనున్నాడు. సఫారీ టూర్లో రెండు టెస్టులు ఆడి 42 పరుగులు మాత్రమే చేసిన అయ్యర్.. త్వరలో స్వదేశంలో ఇంగ్లండ్తో జరగాల్సి ఉన్న ఐదు మ్యాచ్ల టెస్టు సిరీస్లో చోటు దక్కించుకోవాలంటే రంజీలలో రాణించాల్సి ఉంది. ఈ మేరకు సెలక్టర్లు అతడిని రంజీలు ఆడి ఫామ్ లోకి రావాలని సూచించినట్టు సమాచారం. సెలక్టర్ల ఆదేశంలో శ్రేయస్.. జనవరి 12 నుంచి ముంబై వేదికగా ఆంధ్రాతో జరగాల్సి ఉన్న మ్యాచ్ ఆడనున్నాడు. ఈ మ్యాచ్కు అజింక్యా రహానే సారథిగా వ్యవహరించనున్నాడు.