IPL 2023 : ఐపీఎల్ పదహారో సీజన్కు మరో నాలుగు రోజులే ఉంది. ఇప్పటికే అన్ని జట్లు ప్రాక్టీస్ వేగం పెంచాయి. రెండుసార్లు చాంపియన్ కోల్కతా నైట్ రైడర్స్(Kolkata Knight Riders) కెప్టెన్ వేటలో పడింది. శ్రేయస్ అయ్యర్ (Shreyas Iyer) గాయం నుంచి కోలుకోకపోడంతో ఆ జట్టుకు కొత్త నాయకుడి ఎంపిక ప్రారంభించింది. కెప్టెన్ రేసులో ఆల్రౌండర్ శార్ధూల్ ఠాకూర్(Shardul Thakur), విండీస్ మిస్టరీ స్పిన్నర్ సునీల్ నరైన్(Sunil Narine) ముందు వరుసలో ఉన్నారు. ఈ ఇద్దరిలో ఒకరికి కెప్టెన్సీ అప్పగించాలని కోల్కతా యాజమాన్యం భావిస్తోంది.
‘ఒకటి రెండు రోజుల్లో ఫ్రాంఛైజీ తమ కొత్త కెప్టెన్ పేరు ప్రకటించనుంది. జట్టు యజమాని షారుక్ ఖాన్, మరికొందరు పాప్ స్టార్ల సమక్షంలో సారథి పేరును వెల్లడించనుంది’ అని ఫ్రాంఛైజీ అధికారి ఒకరు తెలిపారు. శార్ధూల్ కంటే నరైన్కు ఐపీఎల్ అనుభవం ఎక్కువ. అతను దుబాయ్లో జరిగిన ఐఎల్టీ20 లీగ్లో ఇదే ఫ్రాంఛైజీకి చెందిన అబూదాబీ నైట్ రైడర్స్ జట్టును నడిపించాడు. శార్ధూల్ విషయానికొస్తే.. అతడిని ట్రేడ్ ఒప్పందం ద్వారా ఢిల్లీ క్యాపిటల్స్(Delhi Capitals) నుంచి రూ.10.75 కోట్లకు కోల్కతా కొనుగోలు చేసింది. ఈ ఆల్రౌండర్కు ఈ జట్టుతో ఇదే తొలి సీజన్. అంతేకాదు అతను టీమిండియాలో సభ్యుడు కూడా. దాంతో, కోల్కతా కొత్త కెప్టెన్గా నరైన్ కంటే ఇతడికే అవకాశాలు ఎక్కువ అని అనుకుంటున్నారంతా.
కేకేఆర్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ (Shreyas Iyer) వెన్నెముక గాయం నుంచి పూర్తిగా కోలుకోలేదు. బోర్డర్ – గవాస్కర్ ట్రోఫీ ఆఖరి టెస్టులో గాయం తిరగబెట్టడంతో అతను బరిలోకి దిగలేదు. వన్డే సిరీస్లోనూ అయ్యర్ ఆడలేదు. ఈ సీజన్ ఐపీఎల్లో అతను ఆడేది అనుమానమే. దాంతో, కేకేఆర్ జట్టుకు కొత్త కెప్టెన్ను వెతుక్కోవాల్సిన అవసరం వచ్చింది. గౌతం గంభీర్(Gautam Gambhir) కెప్టెన్సీలో కోల్కతా ఐపీఎల్ చాంపియన్గా అవతరించింది. 2017 తర్వాత ఆ జట్టు ప్రదర్శన ఆకట్టుకోలేదు. గత సీజన్లో అయ్యర్ కెప్టెన్సీలోనూ కోల్కతా విఫలమైంది. ఈసారి ఎలాగైనా పూర్వ వైభవం సాధించాలని ఆ జట్టు భావిస్తోంది. పదహారో సీజన్ ఐపీఎల్ మార్చి 31న మొదలు కానుంది. డిఫెండింగ్ చాంపియన్ గుజరాత్ టైటన్స్, చెన్నై సూపర్ కింగ్స్ జట్ల మధ్య అదే రోజు తొలి మ్యాచ్ జరగనుంది.