లండన్: ఇండియా, ఇంగ్లండ్ ( India vs England ) మధ్య జరగనున్న రెండో టెస్ట్కు ముందు రెండు టీమ్స్కు షాక్ తగిలింది. స్టార్ ప్లేయర్స్ శార్దూల్ ఠాకూర్, స్టువర్ట్ బ్రాడ్ గాయాలపాలయ్యారు. వార్మప్ గేమ్లో బ్రాడ్ గాయపడగా.. టీమిండియా ఆల్రౌండర్ శార్దూల్కు తొడ కండరాలు పట్టేశాయి. లార్డ్స్లో 150వ టెస్ట్ ఆడబోతున్న బ్రాడ్కే కాదు.. అంతటి సీనియర్ బౌలర్ సేవలు మిస్ కానున్న ఇంగ్లండ్కు కూడా ఇది మింగుడు పడనిదే. ఇప్పటికే ఆ టీమ్ జోఫ్రా ఆర్చర్, క్రిస్ వోక్స్లాంటి బౌలర్ల సేవలు కోల్పోయింది.
ఇటు శార్దూల్ ఠాకూర్ దూరమవడం కూడా ఇండియన్ టీమ్కు పెద్ద దెబ్బే. తొలి టెస్ట్లో శార్దూల్ మెరుగ్గా రాణించాడు. రెండు ఇన్నింగ్స్లో కలిపి అతడు నాలుగు వికెట్లు తీసుకున్నాడు. రెండో టెస్ట్కు శార్దూల్ దూరమైతే అతని స్థానంలో అశ్విన్ లేదంటే పేస్ బౌలర్లు ఇషాంత్, ఉమేష్లలో ఒకరిని తీసుకునే అవకాశం ఉంది. తొలి టెస్ట్లో టీమిండియా గెలిచేలా కనిపించినా.. చివరి రోజు మొత్తం వర్షం కురవడంతో ఆ మ్యాచ్ డ్రాగా ముగిసింది.