Japan Open 2023 : భారత స్టార్ డబుల్స్ ద్వయం సాత్విక్సాయిరాజ్(Satwiksairaj) – చిరాగ్ శెట్టీ(Chirag Shetty) జైత్రయాత్రకు బ్రేక్ పడింది. వరుసగా 12 విజయాలతో జోరు మీదున్న ఈ వరల్డ్ నంబర్ 2 జోడీకి జపాన్ ఓపెన్ సూపర్ సిరీస్-750లో షాక్ తగిలింది. ఈరోజు జరిగిన క్వార్టర్ ఫైనల్లో సాత్విక్ – చిరాగ్ ఒలింపిక్ విజేతలైన లీయాంగ్(Lee Yang), వాంగ్ చీ లిన్(Wang Chi-Lin) చేతిలో ఓటమి పాలయ్యారు. గంట పది నిమిషాలు జరిగిన మ్యాచ్లో15-21, 25-23, 16-21తో అనూహ్యంగా పరాజయం చెందారు.
వారం క్రితమే కొరియా ఓపెన్(Korea Open) టైటిల్ గెలిచిన సాత్విక్ – చిరాగ్ పోరాడినప్పటికీ పై చేయి సాధించలేకపోయారు. దాంతో, ఎనిమిదో బీడబ్ల్యూఎఫ్ టైటిల్ నెగ్గాలనుకున్న వాళ్ల కల ఫలించలేదు. మరోవైపు సూపర్ ఫామ్లో ఉన్న లక్ష్యసేన్(Lakshya Sen) పురుషుల సింగిల్స్లో సెమీస్కు దూసుకెళ్లాడు. క్వార్ట్ ఫైనల్లో అతను జపాన్కు చెందిన కొకి వతనబేపై 21-15, 21-19తో గెలుపొందాడు.
లక్ష్యసేన్
సెమీస్లో ఇండోనేషియా ఆటగాడు జొనాథన్ క్రిస్టీ(Jonatan Christie)తో లక్ష్యసేన్ అమీతుమీ తేల్చుకోనున్నాడు. దాంతో, ఈ టోర్నమెంట్లో పోటీలో నిలిచిన ఏకైక భారింత షట్లర్ తనే కావడం విశేషం. మరో భారత స్టార్ షట్లర్ హెచ్ఎస్ ప్రణయ్(HS Prannoy) క్వార్టర్స్లోనే వెనుదిరిగాడు. డెన్మార్క్ ప్లేయర్ అక్సెల్సెన్ చేతిలో 21-19, 18-21, 8-21తో చిత్తుగా ఓడిపోయాడు. అతను భారత్కే చెందిన కిదాంబి శ్రీకాంత్(Kidambi Srikanth)ను ఓడించి క్వార్టర్స్కు చేరిన విషయం తెలిసిందే. శ్రీకాంత్పై అతడికి ఇది మూడో విజయం కావడం గమనార్హం.