ODI World Cup 2023 : వన్డే వరల్డ్ కప్(ODI World Cup 2023) షెడ్యూల్ వచ్చినప్పటి నుంచి భారత అభిమానుల్లో(Indian Cricket Fans) ఎక్కడలేని ఉత్సాహం కనిపిస్తోంది. సొంత గడ్డపై మెగా టోర్నీలో అభిమాన క్రికెటర్ల ఆట చూసేందుకు ఎంతో ఆతృతగా ఉన్నారు. ఇప్పటికే చాలామంది ఆన్లైన్లో టికెట్లు (e-tickets) బుక్ చేసుకున్నారు కూడా. అయితే.. షెడ్యూల్లో స్వల్ప మార్పులు చేస్తామని భారత క్రికెట్ బోర్డు సెక్రటరీ జై షా(Jai Shah) నిన్న ప్రకటించగానే కొందరు ఉసూరుమన్నారు. తాజాగా అతను మరో బాంబు పేల్చాడు.
వరల్డ్ కప్ మ్యాచ్లకు ఈ టెకెట్ల(e-Tickets)ను అనుమతించమని స్పష్టం చేశాడు. అభిమానులు కచ్చితంగా టికెట్ ప్రింట్ తీసుకొని స్టేడియానికి రావాలని కోరాడు. అయితే.. కంగారుపడాల్సిన అవసరం లేదని, ఏడు నుంచి ఎనిమిది టికెట్ ప్రింటింగ్ సెంటర్లు ఏర్పాటు చేస్తామని అతను తెలిపాడు. ఈ ఏడాది వన్డే వరల్డ్ కప్ భారత్లో అక్టోబర్ 5న మొదలు కానుంది. ఆరంభ పోరులో ఇంగ్లండ్, న్యూజిలాండ్ జట్లు తలపడనున్నాయి.
వరల్డ్ కప్ ట్రోఫీతో సెహ్వాగ్, జై షా, ముత్తయ్య మురళీధరన్
చిరకాల ప్రత్యర్థులైన టీమిండియా, పాక్ హై ఓల్టేజీ మ్యాచ్ షెడ్యూల్ ప్రకారం అహ్మదాబాద్(Ahmedabad)లో అక్టోబర్ 15న జరగాల్సి ఉంది. కానీ, అదే రోజు దేవీ నవరాత్రులు(Navaratri) మొదలవ్వనున్నాయి. దాంతో, వేలాది మంది అభిమానులు తరలి వచ్చే ఈ మ్యాచ్కు భద్రత కల్పించడం కష్టమవుతుందని.. అందుకని మ్యాచ్ను ముందు తేదీకి అంటే అక్టోబర్ 14న నిర్వహించాలని అహ్మదాబాద్ పోలీసులు బీసీసీఐని కోరారు.
భారత్, పాకిస్థాన్ మ్యాచ్కు ఆతిథ్యం ఇవ్వనున్న అహ్మదాబాద్ స్టేడియం
అయితే.. బీసీసీఐ మాత్రం తేదీని మారుస్తున్నట్టు ఎలాంటి ప్రకటన చేయలేదు. షెడ్యూల్ ప్రకారమే మ్యాచ్ నిర్వహిస్తారా? లేదా ముందు రోజు ఆడిస్తారా? అనే దానిపై త్వరలోనే స్పష్టత రానుంది. 2011లో సొంత గడ్డపై విజేతగా నిలిచిన టీమిండియా మరోసారి అదే ఫలితాన్ని పునరావృతం చేయాలనే పట్టుదలతో ఉంది. మహేంద్ర సింగ్ ధోనీ(MS Dhoni) సారథ్యంలోని భారత జట్టు ఫైనల్లో శ్రీలంకను ఓడించి చాంపియన్గా అవతరించింది.