AB de Villiers : భారత స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లీ(Virat Kohli) మైదానంలో చిరుతలా కదులుతాడని తెలిసిందే. ప్రతిసారి దూకుడే మంత్రగా ఆడే అతడు ఐదొందల మ్యాచ్లో శతకంతో సత్తా చాటాడు. అద్భుత ఇన్నింగ్స్తో సెంచరీ కొట్టిన అతడిపై దక్షిణాఫ్రికా మాజీ కెప్టెన్ ఏబీ డివిలియర్స్(AB de Villiers) ప్రశంసలు కురిపించాడు. కోహ్లీ ప్రపంచంలోని గొప్ప క్రీడాకారుల్లో ఒకడని అతను అన్నాడు. గెలవాలనే కసి.. ప్రతిసారి స్కోర్ చేయాలనే ఆకలి గొప్ప ఆటగాళ్లలో కనిపించే లక్షణాలని, అవన్నీ విరాట్లో పుష్కలంగా ఉన్నాయని డివిలియర్స్ తెలిపాడు.
‘గోల్ఫ్ దిగ్గజం టైగర్ వుడ్స్(Tiger Woods), ఫుట్బాల్ లెజెండ్స్ క్రిస్టియానో రొనాల్డో(Cristiano Ronaldo), లియోనల్ మెస్సీ( Lionel Messi) టెన్నిస్ ఆల్ టైమ్ గ్రేట్ ప్లేయర్లు రోజర్ ఫెదరర్(Roger Federer), రఫెల్ నాదల్(Rafael Nadal), నొవాక్ జకోవిచ్(Novak Djokovic) .. వీళ్లంతా గెలవాలనే కసితో ఆడతారు.
కోహ్లీ, రోజర్ ఫెదరర్, లియోనల్ మెస్సీ
వీళ్లలో పోరాట స్ఫూర్తి అమోఘం. పోటీ ఏదైనా ప్రతిసారి చాంపియన్ అవ్వాలనుకుంటారు. విరాట్ కోహ్లీ కూడా అచ్చం వీళ్లలానే ప్రవర్తిస్తాడు. అంతేకాదు అతడి హృదయం చాలా అందమైనది’ అని డివిలియర్స్ చెప్పుకొచ్చాడు.
మిస్టర్ 360 క్రికెటర్గా డివిలియర్స్ అభిమానుల మనసులో చిరస్థాయిగా నిలిచిపోయాడు. మెరుపు బ్యాటింగ్తో ప్రత్యర్థులను వణికించిన ఈ దక్షిణాఫ్రికా మాజీ కెప్టెన్ క్రికెట్పై చెరగని ముద్ర వేశాడు. 2018లో అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు పలికిన అతను ఆ తర్వాత ఇండియన్ ప్రీమియర్ లీగ్లో తన విధ్వంసక ఇన్నింగ్స్లతో ఫ్యాన్స్ను అలరించాడు.
వెస్టిండీస్పై రెండో టెస్టులో 121 రన్స్ కొట్టిన కోహ్లీ
విరాట్ కోహ్లీతో కలిసి డివిలియర్స్ పదేళ్లు రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టుకు ఆడాడు. ఆ సమయంలో వీళ్లిద్దరి మధ్య అనుబంధం పెరిగింది. కోహ్లీ ఆట, ప్రవర్తనకు డివిలియర్స్ పెద్ద ఫ్యాన్ అయిపోయాడు. 2021లో ఈ దిగ్గజ క్రికెటర్ ఐపీఎల్కు కూడా గుడ్ బై చెప్పేశాడు.
ఈమధ్యే విరాట్ 500వ అంతర్జాతీయ మ్యాచ్ ఆడాడు. చిరస్మరణీయమైన మ్యాచ్లో సెంచరీతో రికార్డులు బద్ధలు కొట్టాడు. వెస్టిండీస్పై రెండో టెస్టులో 121 రన్స్ కొట్టి దిగ్గజాలను మించిపోయాడు. నిరుడు ఆసియా కప్తో ఫామ్ అందుకున్న కోహ్లీ వరుస శతకాలతో చెలరేగుతున్నాడు. టీ20 వరల్డ్ కప్, న్యూజిలాండ్ సిరీస్, ఆస్ట్రేలియా సిరీస్లో పరుగుల వరద పారించాడు. అదే జోరును విండీస్ పర్యటనలోనూ కొనసాగిస్తున్నాడు.