Satwik – Chirag : భారత స్టార్ బ్యాడ్మింటన్ జోడీ సాత్విక్ సాయిరాజ్-చిరాగ్ శెట్టి(Satwik – Chirag) అంచనాలు అందుకుంటూ.. చైనా మాస్టర్స్ సూపర్ సిరీస్ 750 (China Masters Super 750) టోర్నమెంట్ ఫైనల్కు దూసుకెళ్లింది. షెంజెన్లో శనివారం జరిగిన పురుషుల డబుల్స్ సెమీ ఫైనల్లో సాత్విక్ – చిరాగ్ ద్వయం చైనాకు చెందిన హి జి టింగ్(He Ji Ting), రెన్ గ్జియాంగ్ యు (Ren Xiang Yu0)పై గెలుపొందింది.
వారం క్రితమే జపాన్ మాస్టర్స్ టైటిల్ గెలిచిన ఈ చైనా జంటపై భారత జోడీ రెండు సెట్లలో ఆధిపత్యం చెలాయించింది. చివరకు 21-15, 22-20 తేడాతో టింగ్, గ్జియాంగ్ ద్వయాన్ని చిత్తు చేసింది. నిరుడు ఫ్రెంచ్ ఓపెన్(French Open)లో తొలి బీడబ్ల్యూఎఫ్ వరల్డ్ సూపర్ 750 టైటిల్ నెగ్గిన సాత్విక్ – చిరాగ్కు ఇది రెండో ఫైనల్ కావడం విశేషం.
ఈ ఏడాది సూపర్ ఫామ్లో ఉన్న సాత్విక్-చిరాగ్ ద్వయం పలు టోర్నీల్లో చాంపియన్గా అవతరించింది. బ్యాడ్మింటన్ చాంపియన్షిప్, ఇండోనేషియా సూపర్ 1000, కొరియా 500, స్విస్ సూపర్ 300 టైటిళ్లతో పాటు ఈమధ్యే 19వ ఆసియా గేమ్స్ బంగారు పతకం కొల్లగొట్టింది. చైనీస్ మాస్టర్ టోర్నీ క్వార్టర్ ఫైనల్లో సాత్విక్ – చిరాగ్ జోరు కొనసాగిస్తున్నారు. క్వార్టర్ ఫైనల్లో ఈ భారత జోడీ లియో రాలీ-డానియల్ మార్టీన్ (ఇండోనేషియా) జోడీపై నెగ్గింది. తొలి సెట్ గెలిచిన సాత్విక్ – చిరాగ్ రెండో సెట్లోనూ జోరు కనబరిచి 21-16, 21-14తో మ్యాచ్ ముగిచింది. మరోవైపు పురుషుల సింగిల్స్లో భారత స్టార్ షట్లర్ హెచ్ఎస్ ప్రణయ్ క్వార్టర్ ఫైనల్లోనే వెనుదిరిగిన విషయం తెలిసిందే.