Sanju Samson : పదహారో సీజన్ ఐపీఎల్(IPL 2023) మరో మూడు రోజుల్లో మొదలు కానుంది. అన్ని ఫ్రాంఛైజీలు పోటాపోటీగా ప్రాక్టీస్ చేస్తున్నాయి. అయితే.. ఈ సీజన్లో రాజస్థాన్ రాయల్స్(Rajasthan Royals) జట్టుపైనే ఎక్కువ ఒత్తిడి ఉండనుంది. ఈ విషయాన్నిఆ జట్టు కెప్టెన్ సంజూ శాంసన్(Sanju Samson) కూడా అంగీకరించాడు. గత ఏడాది ఫైనల్ చేరడం వల్ల ఈసారి తమపై అంచనాలు ఎక్కువ ఉంటాయని అతను తెలిపాడు. తమ ఫ్రాంచైజీ కొత్త జెర్సీ ఆవిష్కరణ కార్యక్రమంలో మాట్లాడిన సంజూ ఆసక్తికర విషయాలు వెల్లడించాడు.
‘నేను 18 ఏళ్ల వయసులో రాజస్థాన్ రాయల్స్ టీమ్తో కలిశాను. ఇప్పుడు నాకు 28 ఏళ్లు. ఈ పదేళ్ల జర్నీ ఎంతో అద్భుతంగా సాగింది. మా జట్టు గొప్పగా ఆడాలని ఎల్లప్పుడూ అనుకుంటాను. గత ఏడాది రన్నరప్గా నిలిచిన ప్రభావం మాపై కచ్చితంగా ఉంటుంది. 2022లో ఫైనల్ చేరడానికి మా జట్టు సభ్యులందరి అద్బుత ప్రదర్శనే కారణం. అనుభవజ్ఞుడైన కుమార సంగక్కర హెడ్ కోచ్గా ఉండడం మా అదృష్టం’ అని శాంసన్ తెలిపాడు.
16వ సీజన్ ఐపీఎల్ మార్చి 31న ప్రారంభం కానుంది. తొలి మ్యాచ్లో డిఫెండింగ్ చాంపియన్ గుజరాత్ టైటన్స్, చెన్నై సూపర్ కింగ్స్ తలపడనున్నాయి. రాజస్థాన్ ఈ సీజన్లో ఏప్రిల్ 2న సన్ రైజర్స్ హైదరాబాద్తో మొదటి మ్యాచ్ ఆడనుంది. గత సీజన్లో అత్యధిక పరుగులు చేసి ఆ ఆరెంజ్ క్యాప్ అందుకున్న జోస్ బట్లర్ ఈసారి కూడా రాజస్థాన్కు కీలకం కానున్నాడు. ఇరానీ కప్లో సెంచరీల మోత మోగించిన యంగ్స్టర్ యశస్వీ జైస్వాల్ ఈ సీజన్లో ఎలా రాణిస్తాడో చూడాలి. సంజూ శాంసన్, రాహుల్ తెవాటియా కూడా చెలరేగింతే ఇక రాజస్థాన్కు ఎదురుండదు.
పదిహేనో సీజన్ ఐపీఎల్లో అద్భుతంగా రాణించిన సంజూ సేన ఫైనల్లో అడుగుపెట్టింది. మొదట బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ 130 రన్స్కే పరిమితమైంది. స్వల్ప లక్ష్య ఛేదనలో గుజరాత్ టైటన్స్ను జోస్ బట్లర్, కెప్టెన్ హార్దిక్ పాండ్యా ఆదుకున్నారు. దాంతో, 7 వికెట్ల తేడాతో గుజరాత్ గెలుపొందింది. ఆరంగ్రేటం చేసిన సీజన్లోనే ఆ జట్టు చాంపియన్గా అవతరించింది.